1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (16:26 IST)

30 కోట్ల మందికి కరోనా టీకాలు.. వ్యాక్సినేషన్ కోసం రూ.వెయ్యి కోట్లు

ప్రపంచ ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పలు ఫార్మా దిగ్గజ కంపెనీలు టీకాలను తయారు చేస్తున్నాయి. ఇవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అలాగే, మన దేశంలో కూడా ఈ నెలాఖరులో ఈ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 
 
కరోనా టీకా పంపిణీ కోసం కేంద్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. తొలి విడతలో భాగంగా ప్రాధాన్య వర్గానికి(ప్రయారిటీ) 30 కోట్ల మందికి టీకా ఇవ్వనున్నట్టు కేంద్ర అధికారులు చెబుతున్నారు. ఫేజ్-1 కోసం ఏకంగా రూ. 10 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు సమాచారం. ఈ ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించనున్నట్టు తెలుస్తోంది. 
 
టీకా కార్యక్రమం కోసం అంతర్జాతీయ సంస్థల సహాయం తీసుకునేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కరోనా టీకా ఉచితంగా ఇస్తామంటూ బీహార్, కేరళ రాష్ట్రాలు ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో ఇతర రాష్ట్రాలు కూడా ఇదే తరహా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
కాగా.. చవక ధరలో టీకాలు అందేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, గావీ సంస్థలు ప్రారంభించిన కోవాక్స్ కూటమిలో భారత్ కూడా భాగస్వామే. వ్యాక్సిన్ పంపిణీ చేపట్టేందుకు అవసరమైన ఆర్థిక ప్యాకేజీ విషయమై గావీ ఇప్పటికే కేంద్రంతో చర్చలు జరుపుతోంది. ఇక తొలి విడతలో టీకా పొందే ప్రాధాన్య వర్గాలను జాతీయ టీకా నిపుణుల బృందం ఇప్పటికే గుర్తించింది. 
 
కరోనా వారియర్స్ అయిన వైద్యులు, నర్సులు, పారామెడికల్  సిబ్బంది, ఇతర అత్యవసర సిబ్బంది, దీర్ఘ కాలిక రోగాలతో అవస్థ పడుతున్న 50ఏళ్లు పైబడి వారు తొలి విడతలో టీకా పొందుతారు. వీరిలో ఆరోగ్య సిబ్బంది సంఖ్య 1 కోటి కాగా.. అత్యవసర సిబ్బంది సంఖ్య 2 కోట్లు, వృద్ధుల సంఖ్య 27 కోట్లకు పైబడి ఉండొచ్చని తెలుస్తోంది. 
 
అత్యవసర అనుమతుల కోసం ప్రస్తుతం ఫైజర్, భారత్ బయోటెక్(కొవ్యాక్సిన్ టీకా), సిరమ్ ఇన్‌స్టిట్యూట్‌లు(కోవీషీల్డ్ టీకా) రేసులో ఉన్నాయి. అయితే ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా డిజైన్ చేసిన కోవిషీల్డ్‌ టీకాకే మొదట అనుమతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 
 
వచ్చే ఏడాది మార్చి నాటికి ఏకంగా 50 కోట్ల కోవీషీల్డ్ టీకా డోసులను సిద్ధం చేస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్ ఇదివరకే ప్రకటించింది. అయితే..తొలి విడతలో 30 కోట్ల మందికి టీకా ఇచ్చేందుకు భారత్‌కు 60 కోట్ల డోసులు అవసరమవుతుంది.