1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 మే 2022 (09:37 IST)

ఉత్తరకొరియాలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో రోగి మృతి.. కిమ్‌కు తలనొప్పి

Kim
Kim
ఉత్తరకొరియాలో కరోనా విజృంభిస్తోంది. దీంతో కోవిడ్ కిమ్ సర్కారుకు పెద్ద ఛాలెంజ్‌గా నిలిచింది. దాదాపు రెండేళ్ల పాటు కోవిడ్ మహమ్మారిని అడ్డుకుంటున్నట్లు ప్రకటిస్తూ వచ్చిన కిమ్.. ప్రస్తుతం కరోనా వ్యాప్తితో అప్రమత్తం అయ్యారు. 
 
ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసు నిర్ధారణ తర్వాత నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అధికారులతో సమావేశమయ్యారు. మహమ్మారి కట్టడికి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇదిలా ఉండగా.. కరోనా కారణంగా తొలిసారిగా కిమ్‌ జోంగ్ ఉన్‌ మాస్కు ధరించి కనపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
మరోవైపు.. తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైన  24 గంటల్లోపే ఆ రోగి చనిపోవడంతోపాటు మరో ఆరు కొత్త కేసులు వచ్చినట్లు శుక్రవారం వెల్లడైంది. దీంతో కిమ్‌ జోంగ్‌ ఉన్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. 
 
ఇక, నార్త్‌ కొరియాలో ​కోవిడ్‌ టీకాలు అందుబాటులో లేకపోవడంతో పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. ఉత్తర కొరియన్లు ఇప్పటివరకు టీకాలు తీసుకోలేదు. 
 
అంతకుముందు ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో, రష్యా, చైనా ప్రకటించినప్పటికీ.. కిమ్‌ తిరస్కరించారు. 
 
ఇప్పటికే జ్వరం తదితర లక్షణాలతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు బాధపడుతున్నారు. ఆరుగురు మరణించారు. వీరంతా కరోనా వైరస్ బాధితులే అయితే అక్కడ పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు లేకపోలేదు. 
 
ఉత్తర కొరియాలో కరోనా వైరస్ తీవ్రతపై కచ్చితమైన సమాచారం లేదు. కానీ, ఇది ఆ దేశంపై గట్టి ప్రభావాన్నే చూపించనుందని విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే అక్కడ వైద్య సదుపాయాలు చాలా బలహీనం. 2.6 కోట్ల మంది ప్రజలకు టీకాలు వేయలేదు. 
 
జ్వరం లక్షణాలతో బాధపడుతున్న నమూనాలను పరీక్షించగా ఒమిక్రాన్ వేరియంట్ అని తెలిసినట్టు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ సైతం ప్రకటించింది.