1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2022 (09:19 IST)

ఆసియా కప్ : భారత్ ఆశలు గల్లంతు.. ఫైనల్లో పాకిస్థాన్

pakistan team
ఆసియా కప్ టోర్నీలోభాగంగా, బుధవారం రాత్రి ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్ జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు చచ్చీచెడి గెలిచింది. చివరి బంతి వరకు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఆప్ఘనిస్థాన్ జట్టు ఓడినంత పనిచేసింది. అయితే, పాకిస్థాన్ ఆటగాడు నసీమ్ షా వరుస బంతుల్లో రెండు సిక్స్‌లు కొట్టడంతో పాకిస్థాన్ చట్టు మరో నాలుగు బంతులు మిగివుంగానే గెలుపును సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో భారత్ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. అదేసమయంలో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకతో పాకిస్థాన్ జట్టు తలపడనుంది.
 
తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగుల స్వల్ప స్కోరు చేసింది. ఆప్ఘన్ ఆటగాళ్ళను పాక్ బౌలర్లు కట్టడి చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు ఈ స్కోరును ఛేదించేందుకు ఆపసోపాలు పడింది. లక్ష్యఛేదనలో 45 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయిన పాక్ జట్టును ఇఫ్తికార్ అహ్మద్ (30), షాహద్ కాన్ (36)లు ఆదుకున్నారు. 
 
ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో పాక్ గెలిచితీరాంటే ఆరు బంతుల్లో 11 పరుగులు కావాల్సిన తరుణంలో చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. అయితే, ఫరూకీ వేసిన ఆ ఓవర్‌లో నసీమ్ షా తొలి రెండు బంతులను సిక్సర్లుగా మిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.