1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (17:34 IST)

కంగారు పెట్టిస్తున్న భారత స్పిన్ ఉచ్చు - జట్టులోకి కొత్తగా మరో స్పిన్నర్

Kuhnemann
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. గవాస్కర్ - బోర్డర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా, ఇటీవల నాగ్‌పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడిపోయింది. భారీ పరాజయాన్ని చవిచూసింది. భారత్ స్పిన్ ఉచ్చులో చిక్కున్న ఆస్ట్రేలియా బ్యాటర్లు కంగారుపడిపోయి విలవిల్లాడిపోయారు. ఫలితంగా నాగ్‌పూర్ టెస్ట్ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. 
 
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మరో స్పిన్నర్‌ను తీసుకుంది. తొలి టెస్టులో టాడ్ మర్ఫీని ఆడించిన క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు రెండో టెస్టు కోసం మరో స్పిన్నర్‌‍ను తీసుకుంది. ఎడమచేతివాటం స్పిన్నర్ మాట్ కుహ్నెమన్‌ను రంగంలోకి దించనుంది. కుహ్నెమన్ ఇప్పటిదాకా ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడలేదు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు ఓ ప్రకటన చేసింది. 
 
"లెగ్ స్పిన్నర్ మిచెల్ స్పెపన్స్ భార్య గర్భవతి. ఆమె కోసం స్వెప్సన్ స్వదేశానికి తిరిగి వెళుతున్నాడు. అతడి స్థానంలో కుహ్నెమన్‌ను ఎంపిక చేశాం. ఈ టెస్ట్ సిరీస్‌లని మిగతా మ్యాచ్‌లకు కుహ్నెమన్ అందుబాటులో ఉంటాడు" అని పేర్కొన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఢిల్లీ జరిగే రెండు టెస్టులో సీనియర్ స్పిన్నర్ నాథన్ లైయన్, టాడీ మర్ఫీలతో కలిసి కుహ్నెమన్‌ స్పిన్ బాధ్యతలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి.