మంగళవారం, 7 అక్టోబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 సెప్టెంబరు 2025 (19:38 IST)

బీసీసీఐ కొత్త అధ్యక్ష పదవి రేసులో తెరపైకి ఊహించని పేరు...

bcci
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీసీసీఐ చీఫ్ పదవికి కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆయన పేరు మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్. ఆయన ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. అలాగే, తమ ప్యానెల్ తరపున పోటీ చేసే సభ్యులను వెల్లడించారు. 
 
'నేను నామినేషన్ వేయడానికి వచ్చా. ప్యానల్ సిద్ధంగా ఉంది. అధ్యక్ష పదవికి మిథున్ మన్హాస్, నేను ఉపాధ్యక్షుడిగా పోటీ చేస్తా. కార్యదర్శి పదవికి దేవజిత్ సైకియా, సంయుక్త కార్యదర్శిగా ప్రభ్‌తేజ్ సింగ్‌ భాటియా, ట్రెజరర్‌గా రఘురామ్‌ భట్‌ పోటీ పడతారు. గవర్నింగ్‌ కౌన్సిల్‌ కోసం ఇప్పటికే నామినేషన్లను దాఖలు చేయడం జరిగింది. రాబోయే పదవీకాలానికి కొత్త ప్యానల్‌ సభ్యులు బాధ్యతలు చేపడతారు' అని రాజీవ్ శుక్లా వెల్లడించారు. బీసీసీఐ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఏజీఎం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఇప్పుడు నామినేషన్‌ దాఖలు చేసిన ప్యానలే ఖరారు కానుంది.
 
మరోవైపు, అక్టోబరు 2వ తేదీ నుంచి వెస్టిండీస్‌తో టీమ్‌ఇండియా టెస్టు సిరీస్‌ను ఆడనుంది. స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌ కోసం జట్టును మరో మూడు రోజుల్లోగా ఎంపిక చేస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. సెప్టెంబర్ 23 లేదా 24వ తేదీల్లో జట్టు ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ నాలుగో సీజన్‌లో తొలిసారి స్వదేశం వేదికగా టీమ్‌ఇండియా టెస్టు సిరీస్‌ను ఆడనుంది. ఇంగ్లండ్‌తో వారి దేశంలోనే ఐదు టెస్టుల సిరీస్‌లో సమం చేసిన సంగతి తెలిసిందే.