శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 15 జనవరి 2019 (13:13 IST)

అడిలైడ్ వన్డే : మార్ష్ వీరవిహారం.. భారత్ టార్గెట్ 299 రన్స్

నిర్ణయాత్మక రెండో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా, ఆ జట్టు ఆటగాడు షాన్ మార్ష్ సెంచరీతో రెచ్చిపోయాడు. 123 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. దీంతో భారత్ ముంగిట 299 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 
 
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. ఒక్క భువనేశ్వర్ (4/45), షమీ (3/58) మినహా మిగిలిన బౌలర్లు చేతులెత్తేశారు. ప్రధానంగా వన్డేల్లో అరంగేట్రం చేసిన హైదరాబాదీ పేసర్ సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. సిరాజ్ తన పది ఓవర్ల కోటాను పూర్తి చేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా తీయకుండా 76 పరుగులు సమర్పించుకున్నాడు. 
 
మరోవైపు, భారత బౌలర్లు పోరాడినప్పటికీ పిచ్ బ్యాటింగ్‌కు సహకరించడంతో వీలుచిక్కినప్పుడల్లా కంగారూలు అలవోకగా రాబట్టారు. ముఖ్యంగా ఆసీస్ ఇన్నింగ్స్‌లో మార్ష్ బ్యాటింగ్ హైలెట్‌గా నిలిచింది. ఓవర్ వ్యవధిలోనే ఓపెనర్లు వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడిన ఆసీస్‌కు మార్ష్ వెన్నెముకలా నిలిచాడు. పీటర్ హాండ్స్‌కాంబ్(20), మార్కస్ స్టాయినీస్(29)లతో కలిసి రన్‌రేట్ పడిపోకుండా బ్యాటింగ్ కొనసాగించారు. 
 
62 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసిన షాన్ మార్ష్.. 108 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో శతకం పూర్తి చేశాడు. వన్డే కెరీర్‌లో అతనికిది ఏడో సెంచరీ. ఇక శతకం పూర్తైన తర్వాత వేగం పెంచి మాక్స్‌వెల్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆఖర్లో మాక్స్‌వెల్ ఫోర్లతో చెలరేగడంతో ఆసీస్ 298 పరుగుల మార్క్ చేరింది.