మంగళవారం, 3 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త

murder
ఏపీలోని అనంతపురం జిల్లాలో ఓ దారుణం జరిగింది. కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అక్కసుతో ఆమె గొంతు కోసం హత్య చేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అనంతపురం నగరం బిందెల కాలనీకి చెందిన లక్ష్మీ గంగ (27)ను పామిడి మండల కేంద్రానికి చెందిన వీరాంజనేయులు అనే వ్యక్తి పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు గుత్తి రోడ్డు ఎల్లమ్మ కాలనీలో ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె సంతానం. కొన్నేళ్లపాటు కాపురం సవ్యంగా సాగింది. ఆ తర్వాత భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో తరచూ గొడవపడేవారు. ఐదేళ్లపాటు కలహాల కాపురం చేశారు. కొన్ని నెలల క్రితం నుంచి వేరుగా ఉంటున్నారు. 
 
ఇటీవల పెద్దమనుషుల సమక్షంలో భార్యను కాపురానికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇరువురూ మరోమారు గొడవపడ్డారు. ఎలాగైనా భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున మంచంపై నిద్రలో ఉన్న ఆమెపై కత్తితో దాడిచేసి గొంతు కోశాడు. 
 
మెడ సగం వరకు తెగి లక్ష్మీ గంగ అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం ఇద్దరు పిల్లలను తీసుకుని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. భార్యను తానే హత్య చేశానని అంగీకరించాడు. సీఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలిని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.