శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 16 నవంబరు 2022 (10:31 IST)

మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌కు ఊరట

Jacqueline Fernandez
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ వ్యక్తిగత పూచీకత్తుపై ముందస్తు బెయిల్‌ను మంజూరుచేసింది. 
 
ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసుతో సంబంధం కలిగివున్న జాక్వెలిన్.. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆమె ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు కూడా హాజరయ్యారు. 
 
ఇందులో దర్యాప్తు ముగియడంతో చార్జిషీట్లను కూడా ఢిల్లీ పాటియాలా కోర్టులో దాఖలు చేశారు. పైగా ఆమెను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. 
 
ఈ సందర్భంగా ఈడీ తరపు న్యాయవాది వాదిస్తూ జాక్వెలిన్ వద్ద కావాల్సినంత డబ్బు ఉందని, ఆమె విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న సందేహాన్ని లేవనెత్తారు. కేవలం సరదా కోసమే జాక్వెలిన్ ఏకంగా రూ.7.14 కోట్లను ఖర్చుచేసిందని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. 
 
రూ.200 కోట్ల మనీలాండరింగ్ వ్యవహారంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పలుమార్లు ఈడీ ముందు విచారణకు హాజరైన సంగతి తెల్సిందే. ఘరానా మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ మోసాలతో సంపాదించిన డబ్బుతో జాక్వెలిన్ అనేక ప్రయోజనాలు పొందారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తుంది.