శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (20:37 IST)

సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కేఎల్ రాహుల్! ఎలా?

బీసీసీఐకు కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ పోటీలు యూఏఈ వేదికగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు కేవలం ఆరు లీగ్ మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఈ మ్యాచ్‌లలోనే ఏదో ఒక రికార్డు బ్రేక్ అవుతోంది. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ అయింది. కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు కెప్టెన్‌గా ఉన్న యువ క్రికెటర్ కేఎల్ రాహుల్.. సచిన్ రికార్డును చెరిపేశాడు. 
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో అత్యధికంగా రెండు వేల పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ పేరు ఇప్పటివరకు రికార్డుల్లో ఉండేది. ఈ రికార్డును రాహుల్ అధికమించాడు. గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో రెండు పరుగులు చేయడం ద్వారా 2 వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించడానికి టెండూల్కర్ 63 ఇన్నింగ్స్ తీసుకోగా.. రాహుల్ 60 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. దీంతో ఎనిమిదేళ్ళ నాటి రికార్డు కనుమరుగైపోయింది. 
 
ఇకపోతే, ఐపీఎల్‌-2020లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిలకడగా ఆడుతోంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేస్తున్న పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌.. బెంగళూరు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ వికెట్‌ను కాపాడుకుంటూ ఆచితూచి ఆడుతున్నారు. ఓపెనింగ్‌ జోడీ సింగిల్స్‌ తీస్తూ స్కోర్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ఆరు ఓవర్లకు పంజాబ్‌ వికెట్‌ నష్టపోకుండా 50 పరుగులు చేసింది.