శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (11:39 IST)

ఐపీఎల్ 2020 టోర్నీ నుంచి మిచెల్ మార్ష్ దూరం!!

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్లలో ఒకరైన మిచెల్ మార్ష్ ఐపీఎల్ 2020 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓడిన బాధలో ఉన్న ఈ జట్టుకు మార్ష్ దూరంకానుండటం మరింత కుంగదీయనుంది. 
 
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ గాయపడిన విషయం తెల్సిందే. ఈ గాయం పెద్దది కావడంతో మొత్తం ఐపీఎల్‌కే దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో అతడు బంతి వేసిన అనంతరం పిచ్‌పై జారి పడ్డాడు. ఈ క్రమంలో కాలి మడమ నొప్పితో విలవిల్లాడాడు. 
 
ఫిజియో వచ్చి చికిత్స చేసినా ఓవర్‌ మధ్యలోనే మైదానం వీడాడు. మార్ష్‌ గాయం చాలా తీవ్రంగానే కనిపిస్తోందని, ఈ స్థితిలో అతను మిగతా మ్యాచ్‌ల్లో బరిలోకి దిగడం అనుమానమేనని జట్టు వర్గాలు తెలిపాయి. మార్ష్‌ స్థానంలో డాన్‌ క్రిస్టియన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సన్‌రైజర్స్‌ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.