శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2024 (13:17 IST)

15 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న ఇంటెల్!

చిప్‌ల తయారీలో దిగ్గజ కంపెనీగా ఉన్న ఇంటెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. పొదుపు చర్యల్లో భాగంగా, ఆ కంపెనీ ఉద్యోగుల్లో కోత విధించనున్నట్టు ప్రకటించింది. అమెరికాలో అగ్రగామిగా ఉన్న ఇంటెల్ కంపెనీకి ప్రత్యర్థి కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. దీంతో ఈ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
కంపెనీ కార్యకలాపాల క్రమబద్ధీకరణలో భాగంగా 15 శాతానికి పైగా మంది ఉద్యోగులను తగ్గించుకోబోతున్నట్టు గురువారం వెల్లడించింది. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో కంపెనీ సుమారు 1.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో ఈ యేడాది వ్యయాలను సుమారు 20 బిలియన్ డాలర్ల మేర కుదించుకునేలా ప్రణాళికలు రూపొందించుకున్నామని తెలిపింది. 
 
ముఖ్యమైన ఉత్పత్తి, ప్రాసెస్ టెక్నాలజీ పరంగా లక్ష్యాలను చేరుకున్నప్పటికీ రెండవ త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక పనితీరు నిరాశాజనకంగా ఉందని ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాట్ గెల్సింగర్ తెలిపారు. ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో పరిస్థితులు మరింత సవాళ్లతో కూడి ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఇంటెల్ కంపెనీలో గత యేడాది చివరి నాటికి 1,24,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 15 శాతం మందిని తొలగిస్తే దాదాపు 15 నుంచి 18,000 మందిపై ప్రభావం పడొచ్చని అంచనాగా ఉంది. 
 
కొన్ని దశాబ్దాలపాటు ల్యాప్టాప్ నుంచి డేటా సెంటర్ వరకు ఇంటెల్ చిప్‌ల ఆధిపత్యం చెలాయించింది. అయితే ఈ మధ్యకాలంలో ఆ కంపెనీకి పోటీ పెరిగిపోయింది. ఎన్వీడియా, ఏఎమ్జీ, క్వాల్కామ్‌ నుంచి ఆ కంపెనీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా ఏఐ ప్రాసెసర్ల మీద ప్రత్యేక దృష్టిసారించిన ఎన్వీడియా నుంచి ఇంటెల్ కంపెనీకి మార్కెట్లో పోటీ ఎదురవుతోంది.