శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (20:27 IST)

ఆప్‌తో తెగదెంపులు.. ఢిల్లీలో ఒంటరిపోరు... బరిలో బాక్సర్

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. అధికార అమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నించింది. కానీ, ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం మొండివైఖరిని అవలంభించారు. ఈ పొత్తు మిగిలిన రాష్ట్రాల్లో కూడా వర్తించేందుకు సమ్మతించాలని కాంగ్రెస్‌ నేతలపై ఆయన ఒత్తిడి తెచ్చారు. దీనికి కాంగ్రెస్ పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఒంటరిపోరుకు కాంగ్రెస్ మొగ్గు చూపడం, అభ్యర్థులను ప్రకటిండం అంతా జరిగిపోయింది. 
 
ఇకపోతే, ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈయనకు సౌత్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఆప్‌తో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగేందుకు మొగ్గుచూపించిన కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆరుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
 
ఈ జాబితాలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్‌ ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తక్కిన వారిలో జె.పి.అగర్వాల్ (చాందినీ చౌక్), అరవిందర్ సింగ్ లవ్లీ (తూర్పు ఢిల్లీ), రాజేశ్ లిలోతియా (వాయవ్య ఢిల్లీ), మహాబల్ మిశ్రా (పశ్చిమ ఢిల్లీ) ఉన్నారు. 
 
మొత్తం మొత్తం 7 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం మినహా తక్కిన అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దక్షిణ ఢిల్లీ అభ్యర్థిగా బాక్సార్ విజేందర్ సింగ్‌ పేరును మరికాసేపట్లో ప్రకటించే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాల తాజా సమాచారం. అయితే, మరో సీనియర్ నేత కపిల్ సిబల్‌కు కూడా టిక్కెట్ కేటాయించలేదు. దీంతో సౌత్ ఢిల్లీ అభ్యర్థి ఎవరన్నదానిపై సందిగ్ధత నెలకొంది.