మంగళవారం, 17 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

మాజీ అగ్నివీరులకు ఆ భద్రతా దళాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు : కేంద్రం

agniveers
మాజీ అగ్నివీరులకు కేంద్రం శుభవార్త చెప్పింది. బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్పీ రిక్రూట్మెంట్‌లలో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొంది. ఈ మేరకు మాజీ అగ్నివీరులను వివిధ ర్యాంకులలో భర్తీ చేసుకోనున్నామని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ బుధవారం ప్రకటించారు. వారికి వయో సడలింపు కూడా ఉంటుందని వెల్లడించారు. నాలుగేళ్ల అనుభవం, శిక్షణ పొందిన అగ్ని వీరులు భద్రతా బలగాలకు ఆదర్శవంతమైన అభ్యర్థులు అవుతారని హోం మంత్రిత్వ శాఖ గుర్తించిన నేపథ్యంలో బీఎస్ఎఫ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికత, హోంమంత్రి అమిత్ షా మార్గనిర్దేశనంలో అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించామని హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బీఎస్ఎఫ్‌కు మరింత బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా నిర్దేశించుకున్నారని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేసింది.
 
ఇక మాజీ అగ్నివీరులను చేర్చుకునేందుకు సీఐఎస్ఎఫ్ కూడా సిద్ధంగా ఉందంటూ కేంద్ర హోంశాఖ మరో ట్వీట్లో వెల్లడించింది. మాజీ అగ్నీ వీరులకు వయసు, శారీరక సామర్థ్య పరీక్షలో సడలింపులు ఉంటాయని, కానిస్టేబుల్ పోస్టులకు 10 శాతం రిజర్వేషన్ పొందుతారని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు.
 
మరోవైపు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కూడా మాజీ అగ్నివీరులకు రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో, అగ్ని వీరులకు వయస్సు, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టుల్లో సడలింపులు పెంచుతున్నట్టు హోం శాఖ ప్రకటనలో పేర్కొంది. భద్రతా బలగాల బలోపేతానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని డైరెక్టర్ జనరల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్ఓ) కూడా అగ్నివీరులకు కోటా లభించనుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.