శుక్రవారం, 14 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 అక్టోబరు 2025 (17:23 IST)

జీమెయిల్‌కు మంగళం ... జోహో ఫ్లాట్‌ఫామ్‌కు స్వాగతం... కేంద్ర మంత్రి అమిత్ షా

zoho mail
భారత్‌పై అమెరికా సుంకాల మోతం మోగిస్తోంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశీ పిలుపునిచ్చారు. దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించాలన్న ప్రధాని మోడీ కోరారు. స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు, డిజిటల్ ఇండియాలో భాగంగా జోహో ఫ్లాట్‌ఫామ్ వైపు అనేక మంది సినీ రాజకీయ నిపుణులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వనీ వైష్ణవ్‌లు గూగుల్ క్రోమ్ ఫ్లాట్‌ఫామ్‌కు మంగళంపాట పాడేశారు. ఇపుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా మారిపోయారు. జోహో ఫ్లాట్ ఫామ్‌లో కొత్త మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకున్నారు. ఈ విషయాన్నిఆయన బుధవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. 
 
'హలో.. నేను జోహో మెయిల్‌కు మారాను. నా ఈమెయిల్ చిరునామాలో ఈ మార్పును గమనించండి. [email protected] నా కొత్త మెయిల్ అడ్రెస్' అని అమిత్‌ షా తన పోస్టులో రాసుకొచ్చారు. ఇకనుంచి మెయిల్స్ అన్నీ ఈ కొత్త అడ్రస్‌కే పంపాలని చెప్పారు. భారత్‌పై అమెరికా సుంకాల మోత, జీఎస్టీ సంస్కరణల వేళ ప్రధాని మోడీ 'స్వదేశీ' పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. 'భారత్‌ బలమైన దేశంగా ఎదుగుతున్న వేళ.. కొన్ని సవాళ్లు తప్పవు. అటువంటి సమయాల్లో 'ఆత్మనిర్భర్' స్ఫూర్తిని కొనసాగించాలి. ఈ నేపథ్యంలో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించండి' అంటూ ఆయన ఎన్డీయే ఎంపీలకు పిలుపునిచ్చారు. దీంతో పలువురు కేంద్ర మంత్రులు జోహో సేవలను వినియోగిస్తున్నారు. 
 
కాగా, జీమెయిల్, మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్‌కు పోటీగా జోహో మెయిల్‌‌ను తీసుకువచ్చారు. ఇప్పుడు ఈమెయిల్‌లోకి అమిత్‌ షా మారగా మైక్రోసాఫ్ట్‌ పవర్‌పాయింట్ బదులు జోహోతోనే కేబినెట్‌ ప్రంజెంటేషన్‌ తయారు చేసినట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. జోహో రూపొందిన మెసేజింగ్‌ యాప్‌ ‘అరట్టై’ని వాడాలంటూ ధర్మేంద్ర ప్రధాన్‌ ఇంతకుముందు పిలుపునిచ్చారు. ప్రస్తుతం అరట్టైకు విశేష ఆదరణ లభిస్తోంది. 
 
ఈ యాప్‌ను విపరీతంగా డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. యూజర్ల ప్రైవసీ కోసం త్వరలోనే ‘అరట్టై’లోనూ ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు తాజాగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో సమాచార గోప్యతపై పెద్దఎత్తున చర్చ జరుగుతోన్న సమయంలో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.