శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (19:25 IST)

వెనక్కి తగ్గని రైతులు.. బెట్టువీడని కేంద్రం.. మరో''సారీ''

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ రైతులకు నచ్చజెప్పేందుకు కేంద్రం.. రైతులతో జరుపుతున్న చర్చలు మరోమారు విఫలమయ్యాయి. 
 
శుక్రవారం ఎనిమిదో పర్యాయం కేంద్రం, రైతులు ఢిల్లీలో జరిపిన చర్చలు ఎలాంటి సానుకూల ఫలితం తేలకుండానే ముగిశాయి. ఎవరి వాదనలకు వారు కట్టుబడి ఉండటంతో తాజా చర్చలు కూడా నిష్ఫలం అయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 15న మరోసారి సమావేశమవ్వాలని ద్రమంత్రులు, రైతు సంఘాల ప్రతినిధులు నిర్ణయించారు.
 
కాగా, శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఇతర మంత్రులు పియూష్ గోయల్, సోంప్రకాశ్... 41 రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 
 
చర్చలు ప్రారంభమైన కాసేపటికే ఫలితం ఎలా ఉండబోతుందన్నది స్పష్టమైంది. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాల ప్రతినిధులు పట్టుబట్టగా, రద్దు చేసే ఆలోచన ఎన్డీయే ప్రభుత్వానికి లేదని కేంద్రమంత్రులు స్పష్టం చేశారు.
 
అయితే, రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లి అనుకూల తీర్పుతో వస్తే చట్టాలను వెనక్కితీసుకునేందుకు ప్రయత్నిస్తామని కేంద్రమంత్రులు రైతు సంఘాల ప్రతినిధులతో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. 
 
కానీ సుప్రీంకోర్టు చట్టాల అమలును స్వాగతిస్తే మాత్రం రైతులు నిరసనల నుంచి తప్పుకోవాల్సిందేనని కేంద్రమంత్రులు కరాఖండీగా చెప్పినట్టు సమాచారం. 
 
ఈ నేపథ్యంలో, రైతులు తమ పట్టు విడవకుండా చట్టాలను రద్దు చేసేవరకు నిరసనలు ఆపేది లేదని స్పష్టం చేశారని, సుప్రీంకు వెళితే ఎంతో సమయం పడుతుందని వారు అభ్యంతరం వ్యక్తం చేశారని వెల్లడైంది.