శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (12:27 IST)

లండన్‌తో పోల్చితే భారత్‌లో చౌక ధరకే కరోనా వ్యాక్సిన్!

విదేశాలతో పోల్చితే భారత్‌లో తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనికాలు సంయుక్తంగా తయారు చేస్తున్న ఈ టీకాను మన దేశంలో పూణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. 
 
ఈ వ్యాక్సిన్ మన దేశంలో జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంల అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత తొలుత వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే, సీరమ్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రణాళికను సిద్ధం చేసింది. 
 
ఒకసారి బ్రిటన్‌లో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి రాగానే, ఆ వెంటనే ఇండియాలోనూ వాడకానికి అనుమతి ఇస్తారన్న నమ్మకంతో సీరమ్ సంస్థ దేశ వ్యాప్తంగా ముమ్మర ఏర్పాట్లలో నిమగ్నమైవుంది. అంతేకాకుండా, భారత్‌లో అత్యవసర ఎమర్జెన్సీ వినియోగం నిమిత్తం వ్యాక్సిన్‌కు అనుమతి ఇవ్వాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ డిసెంబరులో కేంద్రానికి దరఖాస్తు చేయనుంది. 
 
అయితే, ఎన్ని డోస్‌లు అందుబాటులోకి వస్తాయి? ఎంత మందికి వ్యాక్సిన్‌ను పంపిణీ చేయగలము అన్న అంశాలపై పూర్తిగా సమీక్షించిన తర్వాతనే ప్రభుత్వం ఈ విషయంలో తుది నిర్ణయానికి రావాలని భావిస్తోందని తెలుస్తోంది. 
 
ఇక ఈ వ్యాక్సిన్ ధర లండన్ ధరతో పోలిస్తే సగం వరకూ తక్కువకే ఇండియాలో లభ్యం కానుంది. అంటే రెండు డోస్‌ల వ్యాక్సిన్ ధర రూ.500 నుంచి రూ.600 మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయని సీరమ్ అధికారులు తెలిపారు. 
 
మరోవైపు, ఎమర్జెన్సీ వినియోగానికి భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ గట్టిపోటీని ఇవ్వనుంది. ఒకటి, రెండో దశ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ సమర్పించి, అవి సంతృప్తికరంగా ఉంటే, అత్యవసర వినియోగానికి నియంత్రణా సంస్థల అనుమతి లభిస్తుందని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.