మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (12:46 IST)

కారు డ్రైవ్ చేస్తుంటే మాస్కు ధరించలేదని ఫైన్.. రూ.10 లక్షల పరిహారం కోరుతూ పిటిషన్

న్యూఢిల్లీలో పోలీసులకు ఓ న్యాయవాది చుక్కలు చూపించాడు. కారులో ఒంటరిగా వెళుతున్న వ్యక్తికి మాస్కు ధరించలేదని ఢిల్లీ పోలీసులు అపరాధం వసూలు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ వ్యక్తి నేరుగా ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒంటరిగా కారులో వెళుతుంటే మాస్క్ ధరించలేదని ఫైన్ వేసి, మానసికంగా వేధించారని, అందువల్ల తనకు 10 లక్షల రూపాయల అపరాధం చెల్లించేలా ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు సహేతుకంగా ఉండటంతో ఢిల్లీ హైకోర్టు సైతం విచారణకు స్వీకరిస్తున్నట్టు పేర్కొంది. 
 
మరిన్ని వివరాల్లోకి వెళితే, న్యూఢిల్లీలో ఓ న్యాయవాది కారులో ప్రయాణిస్తున్న వేళ పోలీసులు ఆపారు. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశంలో కారు నడుపుతున్నాడని ఆరోపిస్తూ, జరిమానా విధించారు.  ఈ చర్యతో తన పరువు పోయిందని, తాను అన్ని నిబంధనలనూ పాటిస్తున్నానని చెబుతూ, కోర్టును ఆశ్రయించాడు.
 
తాను తన సొంత కారులో ఒక్కడినే ఉన్నానని, అటువంటి సమయాల్లో మాస్క్ అవసరం లేదని కేంద్ర మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉందని పిటిషనులో పేర్కొన్నారు. ప్రజల మధ్యకు వెళితే, తాను మాస్క్ ధరిస్తానని, ఒంటరిగా ఉన్న సమయంలో అది అవసరం లేదని అన్నాడు.
 
తాను కరోనా నిబంధనలను అన్నిటినీ పాటిస్తున్నానని, అయినా తనను అన్యాయంగా పోలీసులు వేధించి, ఫైన్ కట్టించారని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చాడు. తనకు ఎంతో మానసిక ఒత్తిడి కలిగిందని, ఢిల్లీ పోలీసుల నుంచి తనకు రూ.10 లక్షలు పరిహారం ఇప్పించాలంటూ పేర్కొన్నారు.
 
పైగా, తాను ఒంటరిగా ఉన్న వేళ, మాస్క్ ధరించక పోవడం ఇతరులకు హాని కలిగించినట్టు కాదని స్పష్టం చేశాడు. ఈ కేసును నవంబర్ 18న విచారిస్తామని జస్టిస్ నవీన్ చావ్లాతో కూడిన సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది.