శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 30 జనవరి 2021 (11:34 IST)

దేశ రాజధానిలో రైతుల నిరాహార దీక్ష

దేశ రాజధానిలో రైతుల ఆందోళన ఉగ్రరూపం దాల్చింది. గాంధీ వర్థంతి సందర్భంగా.. సద్భావనా దివస్‌ను పాటించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. శనివారం సాయంత్రం 5 గంటల వరకు ఢిల్లీ సరిహద్దుల్లో రైతన్నలు నిరాహార దీక్షకు దిగారు. ఢిల్లీలో రైతుల శాంతియుత ర్యాలీకి సంఘీభావంగా ఎపి రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిరాహార దీక్షలు చేపడుతున్నారు.
 
బీకేయూ ప్రతినిధి రాకేష్‌ తికాయత్‌ ఉద్వేగ ప్రసంగంతో ఉవ్వెత్తున రైతు ఉద్యమం ఎగసిపడుతోంది. సరిహద్దులకు వేలాదిగా అన్నదాతలు తరలివస్తున్నారు. ఉద్యమాన్ని విచ్చిన్నం చేసే కుట్ర జరుగుతోందని, తమ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ రెండో దశ పోరాటం చేపట్టాలని రైతు సంఘాలు తీర్మానించాయి.
 
మరోవైపు రైతుల ఆందోళనకు మద్దతుగా యుపి లోని ముజఫర్‌నగర్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. యుపి కి చెందిన రైతులు ఢిల్లీకి తరలివచ్చి రైతుల ఆందోళనకు మద్దతు పలకాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
 
యూపీ, హర్యానా రాష్ట్రాల నుంచి రైతన్నలు పోటెత్తారు. మీరట్‌, బిజ్నోర్‌, బాగ్‌పట్‌, ముజఫర్‌నగర్‌, మొరాదాబాద్‌, బులంద్‌షహర్‌ ఇలా అన్ని జిల్లాల నుంచి ఘాజీపూర్‌ కు వేలాదిమంది అన్నదాతలు చేరుకుంటున్నారు.

ప్రస్తుతం 20 వేలకు పైగా రైతన్నలు ఆందోళనలో ఉద్యమిస్తున్నారు. మరోవైపు, హర్యానాలో ఇంటర్‌నెట్‌ సేవలను అధికారులు బంద్‌ చేశారు. సోషల్‌ మీడియాలో పుకార్లు కంట్రోల్‌ చేసేందుకు ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం.
 
ఘాజీపూర్‌ సరిహద్దుల్లో స్థానికుల ఆందోళనతో అక్కడి నుంచి వెళ్లి పోవాలంటూ రైతులపై పోలీసులు ఒత్తిడి పెంచారు. రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులను ఖాళీ చేయించాలని చూశారు.

మీ తూటాలకు భయపడేది లేదంటూ రాకేష్‌ తికాయత్‌ తెగేసి చెప్పారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతన్నలు కన్నీటి పర్యంతమయ్యారు.


రాకేష్‌ తికాయత్‌పై తప్పుడు కేసులు పెట్టారని.. ఆయన్ను దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ఆయనకు మద్దతుగా పోరాటం చేయాలని నిర్ణయించిన రైతు సంఘాలు.. సరిహద్దులను ఖాళీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వేలాదిగా కదం తొక్కుతున్న అన్నదాతలతో సింఘు , ఘాజీపూర్‌ , టిక్రీ సరిహద్దుల్లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది.