1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (08:20 IST)

ఉత్తరాది రాష్ట్రాలు గోమూత్రానికి నిదర్శనం కాదు : గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్

tamizhisai sounderrajan
ఉత్తరాది రాష్ట్రాలు గోమూత్రానికి నిదర్శనం కాదని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. ఇటీవలి కాలంలో కొందరు రాజకీయ నేతలు ఉత్తరాది, దక్షిణాది విభజన వాదనను తెరపైకి తెస్తున్నారని, ఇది అత్యంత బాధాకరమన్నారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ.. గోమూత్ర ఉన్న రాష్ట్రాల్లోనే భారతీయ జనతా పార్టీ గెలుస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి పెను దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్పందించారు. ఉత్తరాది రాష్ట్రాలు గోమూత్రానికి నిదర్శనం కాదని, వాటిది గోముద్ర అని పేర్కొన్నారు. అవి పవిత్ర గోమాతకు చిహ్నమన్నారు. 
 
అహ్మదాబాద్‌లోని గుజరాత్ విశ్వవిద్యాలయం, ఇండియా థింక్ కౌన్సిల్ నిర్వహించిన 'కల్చరల్ ఎకానమీ సమ్మిట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. గోమూత్ర రాష్ట్రాల్లోనే భాజపా గెలుస్తుందంటూ సెంథిల్ కుమార్ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. 'నేను తమిళనాడు నుంచే వచ్చాను. ఈ మధ్య ఉత్తర - దక్షిణ విభజనను తీసుకురావడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. అందుకే నేను ఇలా చెప్పాల్సి వస్తోంది.
 
మా రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీ.. ఉత్తరాది రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలని వ్యాఖ్యానించడంపై నేను బాధపడుతున్నా. ఉత్తర - దక్షిణ విభజన ఉండకూడదు. పరస్పరం గౌరవించుకోవాలి. పూర్వం తమిళనాడులో ప్రజలు దేవుడి ముందు ఒక హుండీ ఉంచేవారు. అందులో నిత్యం డబ్బు సమర్పించేవారు. అలా పొదుపు చేసుకున్న సొమ్ముతో.. జీవితంలో కనీసం ఒక్కసారైనా కాశీయాత్ర (నేటి వారణాసి) చేయాలనుకునేవారు' అని తెలిపారు. 
 
తమిళనాడు ప్రజలు తమ రాష్ట్రంలోని రామేశ్వరం ఆలయాన్ని, ఉత్తరాదిన ఉన్న కాశీని వేర్వేరుగా చూడరని చెప్పారు. "కాశీని సందర్శించేవారు తమ తీర్థయాత్రను సంపూర్ణం చేసుకోవడానికి రామేశ్వరం కూడా వస్తారు. అలాగే రామేశ్వరం వచ్చినవారు.. కాశీని కూడా సందర్శిస్తారు" అని పేర్కొన్నారు.