1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (16:03 IST)

కేరళలో కుంభవృష్టి : ఐదు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక

కేరళ రాష్ట్రంలో మరోమారు కుంభవృష్టి కురుస్తుంది. దీంతో ఐదు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికను జారీచేశారు. శనివారం ఉదయం నుంచి కుండపోత వానలు కురుస్తుండడంతో కేరళ దక్షిణాది జిల్లాల్లో నదులు ఉప్పొంగుతున్నాయి. 
 
ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ సాయంత్రానికి ఉత్తరాది జిల్లాల్లో వర్ష తీవ్రత మరింత పెరుగుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఈ మేరకు ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కూటిక్కల్ ప్రాంతంలో వరద కారణంగా ఏడుగురు వ్యక్తులు గల్లంతయ్యారు.
 
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కేరళలోని డ్యామ్ లు పరవళ్లు తొక్కుతున్నాయి. ఇడుక్కి జిల్లాలోని మలంకర డ్యామ్ కు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తేందుకు కలెక్టర్ అనుమతి మంజూరు చేశారు. 
 
అటు, ఎర్నాకుళం జిల్లాలో మువట్టుపుళ నది ఉగ్రరూపం దాల్చింది. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు స్పష్టం చేశారు. గతంలో వరద అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ప్రజలు హడలిపోతున్నారు.
 
ఇదిలావుంటే, హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, ల‌క్డీకాపూల్, సోమాజిగూడ, ఖైర‌తాబాద్‌, హిమాయ‌త్ న‌గ‌ర్, నాంప‌ల్లి ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. బంజరాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది.  
 
చాద‌ర్‌ఘాట్‌, కోఠి, అఫ్జ‌ల్ గంజ్, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్ నగర్‌, హయ‌త్‌న‌గ‌ర్‌ ప‌రిసర ప్రాంతాలతో పాటు సికింద్రాబాద్, తార్నాక‌, ఉప్ప‌ల్, ఎల్బీన‌గ‌ర్ లో వ‌ర్షం ప‌డుతోంది. కాగా, ప‌లు ప్రాంతాల్లో రోడ్ల‌పై నీళ్లు నిల‌వ‌డంతో వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డుతున్నారు.