1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జూన్ 2022 (08:59 IST)

జేకేఎన్‌పీపీ వ్యవస్థాపకుడు భీంసింగ్ ఇకలేరు

Bhim Singh
జమ్మూకాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (జేకేఎన్‌పీపీ) వ్యవస్థాపకుడు భీంసింగ్ కన్నుమూశారు. ఈయనకు 81 సంవత్సరాలు. ఆయన గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. దీంతో జమ్మూకాశ్మీర్‌లోని జీఎంసీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈయన ఒక రచయితగా, మానవహక్కుల నేతగా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌లో సీనియర్ కార్యవర్గ సభ్యుడుగా సుపరిచితుడు. 
 
కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భీంసింగ్ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 1982లో జమ్మూకాశ్మీర్‌ నేషనల్ పాంథర్స్ పార్టీని స్థాపించారు. జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీకి 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ నాలుగు స్థానాల్లో గెలిచింది. 
 
ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పాలస్తీనా అధినేత యాసర్ అరాఫత్, క్యూబా విప్లవ కెరటం ఫిడెల్ కాస్ట్రో, ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్ధాం హుస్సేన్, లిబియా నియంత గడాఫీతో భీంసింగ్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. కాగా, ఈయన భార్య, కుమారుడు ఉన్నారు. వీరు ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు.