శెభాష్ నాయుడు... క్లిష్ట సమయంలో మీ పనితీరు సూపర్ : ప్రధాని మోడీ కితాబు
టీడీపీ లోక్సభ సభ్యుడు, కేంద్ర పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్ నాయుడుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. క్లిష్ట సమయంలో మంచి సమయస్ఫూర్తితో, సమర్థమంతంగా వ్యవహరించారంటూ కితాబిచ్చారు. ఇండిగో విమాన సర్వీసుల రద్దు సంక్షోభం సమయంలో కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రిగా రామ్మోహన్ నాయుడు విపక్ష సభ్యుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ నుంచి గట్టి మద్దతు లభించింది. క్లిష్ట సమయంలో సమర్ధంగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి పనితీరును ప్రధాని స్వయంగా అభినందించారు.
ఇండిగో సమస్యపై రామ్మోహన్ నాయుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించారని, శాఖాపరంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నారని కితాబిచ్చారు. ప్రస్తుతం వస్తున్న విమర్శలు, ఆరోపణలు పట్టించుకోకుండా ముదుకు సాగాలని మంత్రి రామ్మోహన్కు ప్రధాని సూచించారు.
గత వారం రోజులుగా ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన వందలాది విమాన సర్వీసులు రద్దు కావడంతో దేశ వ్యాప్తంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయంతెల్సిందే. ఈ అంశంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తోంది. ఈ సంక్షోభంపై కేంద్రం తీసుకుంటున్న చర్యల గురించి రామ్మోహన్ నాయుడు సోమవారం రాజ్యసభలో వివరణ ఇచ్చారు. ఈ తరుణంలో స్వయంగా ప్రధాని మోడీయే ఆయనను ప్రశంసించడం ప్రాధాన్యత సంతరించుకుంది.