కరూర్ బాధితులను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ - దర్యాప్తు చేపట్టిన సీబీఐ
కరూర్లో జరిగిన తొక్కిసలాటలో 41మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతరం చెన్నైకి తిరుగుముఖం పట్టిన టీవీకే పార్టీ అధినేత విజయ్.. అక్టోబర్ 27న చెన్నై మహాబలిపురంలో కరూర్ బాధితులను కలిశారు. ఈ సందర్భంగా కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన విజయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దుర్ఘటనకు క్షమాపణలు చెప్పారు. తప్పకుండా కరూర్ వచ్చి బాధితులను కలుస్తానని హామీ ఇచ్చారు. కరూర్ బాధిత కుటుంబ సభ్యులకు తప్పకుండా అండగా వుంటామని హామీ ఇచ్చారు.
విద్య, ఉపాధి, వివాహాలకు ఆర్థిక సాయం అందిస్తానని విజయ్ బాధితులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. కరూర్ ఘటన అనంతరం చెన్నైకి రావడం వెనుక భద్రతా సంబంధిత కారణాలున్నాయని విజయ్ బాధితులతో తెలిపారు.
ఇకపోతే.. టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట ఘటన కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేపట్టింది. తమిళనాడు హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది.
గత నెల 27న కరూర్లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసును ఐజీ ఆశా గార్గ్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేపట్టింది.