శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 అక్టోబరు 2020 (16:38 IST)

ఇంటికి పిలిచి తండ్రీకొడుకు బలాత్కారం చేశారు.. గాయని ఫిర్యాదు..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అధికార బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న నిషద్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, అతని కుమారుడుపై ఓ గాయని లైంగిక ఆరోపణలు చేశారు. గత 2014లో ఎమ్మెల్యే ఇంటికి పిలిచారనీ, దీంతో తాను ఇంటికి వెళ్లగా, తండ్రీతనయులు మార్చిమార్చి అత్యాచారం చేశారని ఆరోపిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడుపై కేసు నమోదు చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 2014లో నిషద్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయ్‌ మిశ్రా ఓ కార్యక్రమం కోసం 25 ఏళ్ల బాధిత గాయ‌నిని తన ఇంటికి పిలిచారు. ఈ క్రమంలో విజయ్‌ మిశ్రా, అతడి కుమారుడు ఆమెపై అత్యాచారం చేశారు. దీని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఎమ్మెల్యే తనను బెదిరించారని బాధితురాలు ఇపుడు ఆరోపిస్తున్నారు. 
 
అలాగే, 2015లో వారణాసిలో ఒక హోటల్‌లో ఎమ్మెల్యే మరోసారి బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు బధోహి ఎస్పీ రామ్‌ బదన్‌ సింగ్‌ తెలిపారు. అనంతరం మిశ్రా ఆమెను ఇంటి దగ్గర వదిలేయమని కొడుకు, మేనల్లుడికి చెప్పారని.. అయితే వారు కూడా ఆమెపై అత్యాచారం చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు వెల్లడించారు. 
 
అయితే, ఈ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌ మిశ్రాపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. తాజాగా గత ఏడాది సెప్టెంబర్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన భూమిని ఆక్రమించుకున్నారన్న కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ విషయం తెలియడంతో గాయని... ఆయనపై గోపిగంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. "విజయ్‌ మిశ్రా వద్ద నా వీడియో క్లిప్‌ ఉంది. ఆయన మీద అనేక కేసులు ఉన్నప్పటికి ఎమ్మెల్యే కావడంతో ఫిర్యాదు చేయడానికి నేను భయపడ్డాను" అని చెప్పుకొచ్చింది. గాయని చేసిన ఆరోపణలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.