బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 11 ఏప్రియల్ 2020 (19:15 IST)

40 మంది NRIలను మింగేసిన కరోనా వైరస్, యూఎస్‌లో భయంభయంగా ఎన్నారైలు

కరోనా వైరస్ అమెరికాను కేంద్రంగా చేసుకున్నదా అనిపిస్తోంది. అక్కడ రోజుకి వేలల్లో కరోనా వైరస్ సోకిన రోగులు మరణిస్తున్నారు. ఈ రాకాసి కరోనావైరస్ కారణంగా 40 మందికి పైగా భారతీయ-అమెరికన్లు, భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. మరోవైపు ఎన్నారైలలో సుమారు 1500 మందికి కరోనా వైరస్ పాజిటివ్ పరీక్షలు చేశారనీ, ఆ ఫలితాలు ఇంకా రావాల్సి వుందని చెప్పారు.
 
గత 24 గంటల్లో అమెరికాలో ఏకంగా 2,108 మరణాలు సంభవించాయి. ఒకే రోజులో 2,000 కంటే ఎక్కువ COVID-19 మరణాలను నమోదు చేసిన అమెరికా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా నిలిచింది. అమెరికాలో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య 5,00,000 దాటిపోయింది.
 
అమెరికాలోని COVID-19 కేంద్రంగా మారిన న్యూయార్క్, ప్రక్కనే ఉన్న న్యూజెర్సీల్లోనే అధికంగా మరణాలు సంభవిస్తున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ దేశంలో భారతీయ-అమెరికన్లు వుండే అత్యధిక ప్రాంతాలుగా వున్నాయి. కాగా కరోనా వైరస్ కారణంగా మరణించిన వారిలో 17 మంది కేరళకు చెందినవారనీ, 10 మంది గుజరాత్ నుండి, పంజాబ్ నుండి నలుగురు, ఆంధ్రప్రదేశ్ నుండి ఇద్దరు, ఒరిస్సాకు చెందినవారు ఒకరు ఉన్నారు.