శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 9 మే 2021 (16:49 IST)

న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు ఆలయంలో ఘనంగా విగ్రహ ప్రాణ ప్రతిష్టోత్సవం

ఎడిసన్: అమెరికాలో మరో అద్భుతమైన ఆధ్యాత్మిక వైభవానికి ఇది నాంది.. న్యూజెర్సీలో హిందు ప్రాభవాన్ని కొనసాగించేందుకు షిర్డీ ఇన్ అమెరికా- శ్రీ సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో శ్రీ హేరంబ గణపతి, పంచముఖ శివ, కామాక్షీ అమ్మవారు, శ్రీ వేంకటేశ్వర స్వామి, మురుగన్, హనుమాన్, అయ్యప్పస్వామి, నవగ్రహ దేవత సహిత ఉత్సవ దేవతా మూర్తి, వాసవీ కన్యకాపరమేశ్వరీ, షిరిడీ సాయిబాబా మరియు, దత్త పరంపర సన్నిధి సహితంగా, న్యూ జెర్సీ రాష్ట్ర నడిబొడ్డు ఎడిసన్ నగరం లోని ఓక్ ట్రీ రోడ్లో శ్రీ శివ విష్ణు ఆలయంగా ఆవిర్భవించింది. ఈ ఆలయ ప్రారంభం ఆగమ శాస్త్రోక్తయుక్తంగా, అంగరంగ వైభవంగా న్యూజెర్సీ సాయి దత్త పీఠం నిర్మించిన శ్రీ శివ విష్ణు ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
 
కోవిడ్ నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించారు. ఈ ప్రాణ ప్రతిష్టోత్సవ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ జై స్వరాజ్ టీవీ వారి ద్వారా వీక్షించేలా సాయి దత్త పీఠం ఏర్పాట్లు చేసింది. సౌత్ ప్లైన్ ఫీల్డ్ లో తాత్కాలిక ఆవాసంలో ఉన్న సాయి దత్త పీఠం ఇప్పుడు భక్తులకు మరింత చేరువయ్యేందుకు ఎడిసన్‌లో సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు మందిరాన్ని నిర్మించింది. ఇక ప్రధాన సేవలన్నీ ఎడిసన్ లోని సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు మందిరం నుంచే జరగనున్నాయి.
న్యూజెర్సీలో హిందు ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకే సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు మందిరాన్ని సకల దేవతల సమాహారంగా తీర్చిదిద్దింది. వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా ఈ దేవతల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించింది. పరిమిత సమయాలలో ముందుగా మందిరానికి ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకున్న వారికి, కోవిడ్ నిబంధనులు పాటిస్తూ నూతనంగా నిర్మించిన ఈ శ్రీ శివ, విష్ణు ఆలయాన్ని భక్తులు సందర్శించవచ్చని సాయిదత్త పీఠం నిర్వాహకులు ధర్మశ్రీ రఘుశర్మ శంకరమంచి తెలిపారు.
ఈ సందర్భంగా రఘుశర్మ, భైరవ మూర్తి, మురళీ కృష్ణ శర్మ, మహంకాళీ రామకృష్ణ, సూరి కృష్ణ శర్మలతో పాటు, సాయిదత్త పీఠం పురోహితులు అందరూ కరోనా మహమ్మారి త్వరగా తొలగిపోయి, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక హోమాలు నిర్వహించారు. లోక కళ్యాణార్ధం జరిగిన హోమాది కార్యక్రమాలలో పలువురు భక్తులు పాల్గొన్నారు. గత 7 రోజులుగా జరుగుతున్న ఈ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం ముగింపు సందర్భంగా ఈ రోజు శివపార్వతుల కళ్యాణంతో దేవాలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది.
 
శ్రీ శివ విష్ణు మందిరం ఆలయ నిర్మాణ కార్యక్రమాల్లో ఉపేంద్ర చివుకుల సలహాలతో, సురేష్ జిల్లా గత 2 సంవత్సరాలుగా ఆలయం వద్దే ఉంటూ తన వంతు బాధ్యతగా పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా రఘుశర్మ ఆలయ విగ్రహాలను చేసిన స్తపతులను గుర్తుచేసుకున్నారు. పంచముఖ గణపతి స్థపతి మహా బలిపురం సుధాకరశర్మను, తిరుపతి బాలాజీ విగ్రహ సృష్టికర్త ప్రభు స్వామిని, బాబా విగ్రహ సృష్టికర్త రాజస్థాన్ ముఖేష్ భరద్వాజ్‌ను, ఆలయం విగ్రహ ప్రతిష్ఠ సందర్భముగా క్రేన్ సహాయంతో సాయి భక్తుడు, రఘుశర్మచే సాయిదత్త పీఠ ఆలయ స్థపతిగా గుర్తించబడిన రంగా బోను, తన మిత్ర బృంద సహకారంతో ఎంతో నేర్పుతో మందిర ఏర్పాటులో ఎంతో తోడ్పాటు అందించారు.
ప్రస్తుతం ఇంకా షిప్మెంట్లో ఉన్న వేంకటేశ్వర స్వామి, కామాక్షి అమ్మవారు, వాసవీ కన్యకాపరమేశ్వరీ, మురుగన్, దత్త పరంపర విగ్రహాలు ఇంకా షిప్మెంట్లో ఉన్న విగ్రహాల ప్రతిష్ఠ జూన్ నెలలో జరుగనుందని రఘు శర్మ తెలియచేసారు. తానా అధ్యక్షుడు జె తాళ్లూరి, నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్, ఎక్స్ ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ మన్నవ, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీ హరి మందాడి, టిపి రావ్, టిఎఫ్ఏఎస్ అధ్యక్షులు శ్రీదేవి జాగర్లమూడి, శ్రీనివాస్ గనగోని, సుధాకర్ ఉప్పల, ఈ ఆలయ ప్లాటినమ్ స్పాన్సర్, సంఘ సేవకులు జగదీష్ యలమంచిలి తదితరులు విచ్చేసారు.
 
ఓం సాయి బాలాజీ వ్యవస్థాపకులు మద్దుల సూర్యనారాయణ, పోమోనో రంగనాధ ఆలయ ప్రతినిధులు, రువాయూరప్పన్ ఆలయ ప్రతినిధులు విచ్చేసి మందిర నిర్మాణాన్ని ప్రత్యేకంగా అభినందించాల. ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుండి, కెనడా నుండి ఎందరో సాయి భక్తులు విచ్చేసారు. ప్రముఖ గాయని ఉష తన గాన మాధుర్యంతో గంటకు పైగా భక్తి గాన ప్రవాహంలో భక్తులను ఓలలాడించారు. రఘుశర్మ మాట్లాడుతూ, మందిర నిర్మాణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ప్రతీ వాలంటీర్ గ్రూప్‌ను, స్టాఫ్, డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ 7 రోజులూ నిత్యాన్నదానం జరిగింది. మీడియా పరంగా సహకరించిన ప్రతీ ఛానల్ వారికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.