గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శనివారం, 8 మే 2021 (12:36 IST)

సాయంత్రం వేళ దీపం పెట్టి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే...

శివపురాణంలో కుబేరుడు దొంగ అని చెప్పబడింది. గత జన్మలో దొంగగా ఉన్న కుబేరుడు ఆ తరువాత జన్మలో దేవుడుగా మారడం నిజంగా విచిత్రమే. కుబేరుడు పూర్వజన్మలో చాలా పేదవాడు. అతని పేరు గొన్నిధి. ఒకానొక దశలో తినడానికి తిండి కూడా లభించలేదు. దీంతో కుబేరుడు దొంగగా మారాడు.
 
అయితే ఒకసారి ఒక ప్రదేశంలో ఉన్న శివాలయంలో పెద్ద ఎత్తున బంగారు నగలు, రత్నాలు ఇతర ఆభరణాలు ఉండడాన్ని గొన్నిధి చూశాడు. దీంతో వెంటనే ఆ నగలను దొంగిలించాలని అనుకున్నాడు. ఆ క్రమంలో ఆయన ఆలయంలోకి ప్రవేశించగానే అప్పుడు పెద్ద ఎత్తున గాలి వీచిందట.
 
దీంతో ఆలయంలో శివలింగం ఎదుట ఉన్న దీపం ఆరిపోతుంది. దీపం ఆరిపోతున్న విషయాన్ని గుర్తించిన గొన్నిధి(కుబేరుడు) ఆ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఎంత వెలిగించినా దీపం వెలుగదు. అలా ఎన్నిసార్లు చేసినా ఫలితం లేకుండా పోతుంది. దీంతో విసిగిపోయి తన చొక్కాను తీసి మంటపెట్టి దాంతో దీపాన్ని వెలిగిస్తాడు. అప్పుడు దీపం వెలుగుతుంది. దీనికి శివుడు సంతోషించి గొన్నిధి ఎదుట ప్రత్యక్షమవుతాడు. 
 
అంతేకాదు గణాల్లో ఒక అధిపతిని చేస్తాడు. దీంతో అతను తరువాతి జన్మలో కుబేరుడిగా పుట్టి సంపదకు రక్షకుడుగా ఉంటాడు. కుబేరుడికి గత జన్మలో జరిగినట్లుగా శివుని ఎదుట ఎవరైనా దీపం పెడితే వారి ఆర్థిక సమస్యలు పూర్తిగా పోతాయి. సాయంత్రం వేళ దీపం పెట్టి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. దీంతో సమస్యలన్నీ తొలగిపోతాయి.