భోగి పండుగ 2026.. బలి చక్రవర్తికి ఆహ్వానం.. ఇలాంటి రోజు 2040 వరకు రాదు..
భోగి పండుగ రోజు భోగి మంటలు వేయడం వెనుక మన పురాణాల్లో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. శ్రీమహావిష్ణువు వామన అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన అనంతరం అతనికి ఒక వరమిచ్చాడని చెబుతారు. ఆ వరం ప్రకారం బలి చక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని.. సంక్రాంతి పండుగ ముందు భూలోకానికి వచ్చి ప్రజలందరినీ ఆశీర్వదించాలని చెప్పాడట. అందుకే సంక్రాంతి పండుగ వేళ ముందు రోజు బలి చక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు భోగి మంటలు వేస్తారని పురాణాలు చెప్తున్నాయి.
ఇంకా ఈ భోగి పండుగ రోజున నారాయణ కళ్యాణం, గోదా కళ్యాణం చేయడం, చూడటం చాలా విశిష్టమైనది. అలాగే జనవరి 14న జరుపుకునే భోగి పండుగ రోజున సర్వార్థ, అమృత సిద్ధియోగాలు ఏర్పడటం, షట్తిల ఏకాదశి కలిసిరావడం వంటివి విశేషం. మళ్లీ ఇలాంటి రోజు 2040 వరకు రాదని చెప్తారు.
సూర్యుడు ధనుర్మాసంలో ప్రవేశించిన రోజునే తులసీ వనంలో గోదాదేవి అవతరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. గోదాదేవి తన కోరిక నెరవేరాలనే భావంతో ధనుర్మాసం మొత్తం 30 రోజుల పాటు ఉపవాసం, తపస్సు చేసి.. రంగనాథుడిని వివాహం చేసుకుందని పురాణాలు చెప్తున్నాయి.
గోదాదేవి, రంగనాథుల వివాహం భోగి పండుగ రోజునే జరిగినట్లు సంప్రదాయం. అందుకే భోగి రోజున అనేక ఆలయాల్లో గోదా కళ్యాణం నిర్వహిస్తారు. భోగి నాడు సాయంత్రం బొమ్మల కొలువు పెడతారు. ఆ రోజున చిన్న పిల్లల తలపై భోగి పళ్లను పోస్తారు. బదరీవనంలో శ్రీహరిని పిల్లవాడిగా మార్చి రేగుపళ్లతో అభిషేకం చేశారు. అలా భోగి పళ్ళు పోసే సంప్రదాయం వచ్చింది.
భోగి పండ్లను పిల్లలకు పోసేటప్పుడు చెరుకు ముక్కలు, బంతి పువ్వు రేకులు, రేగు పండ్లు, చిల్లరకాసులు కలిపి పిల్లలకు దిష్టి తీసి తలపై పోస్తారు. అలా చేయడం వలన పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం.