1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. లోక్ సభ ఎన్నికలు 2024
  4. Lok Sabha Election 2024 Live Updates: PM Modi to visit Kerala, hold a roadshow in Hyderabad

నేడు తెలంగాణాలో ప్రధాని మోడీ రోడ్‌‍షో... ఆ తర్వాత బహిరంగ సభ...

narendramodi
ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. శుక్రవారం సాయంత్రం మల్కాజిగిరిలో రోడ్‌షో నిర్వహిస్తారు. శనివారం నాగర్ కర్నూల్‌లో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ పర్యటన కోసం ఆయన శుక్రవారం కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి సాయంత్రం 4:50 నిమిషాలకి చేరుకుంటారు. బేగంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా మల్కాజ్‌గిరికి వెళ్లనున్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్ వరకు దాదాపు 1.2 కిలోమీటర్ల మేర సుమారు గంట సేపు రోడ్ సాగనుంది.
 
శనివారం నాగర్ కర్నూల్లో బీజేపీ బహిరంగసభకు హాజరవుతారు. ఈ సభ నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ లోకసభ స్థానాలు లక్ష్యంగా జరగనుంది. తెలంగాణకు కేంద్రం చేసిన సహాయాన్ని అంకెలతో సహా ప్రజలకు ప్రధాని మోడీ వివరించనున్నారు. దేశంలో మూడోసారి బీజేపీ సర్కార్ రావాల్సిన ఆవశ్యకతను వివరించి మరోసారి ఆశీర్వదించమని ప్రజలను కోరనున్నారు. అలాగే ఈనెల 18న మోడీ జగిత్యాల బహిరంగసభలో పాల్గొంటారు.
 
అయితే ఇప్పటికే ప్రధాని పలుమార్లు తెలంగాణకు వచ్చి వెళ్లారు. తాజాగా మరికొంతమంది బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో మోడీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ లోక్‌సభ స్థానాలే లక్ష్యంగా దానికి రూపకల్పన చేశారు. ఇప్పటికే ప్రధాని 4,5 తేదీల్లో రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల తొలవిడత ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్, పటాన్‌చెరు విజయసంకల్ప సభల్లో పాల్గొన్నారు. అలాగే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమంత్రి అమిత్ ఒకరోజు హైదరాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
 
హైదరాబాద్ శివారు కన్హా శాంతివనంలో నిర్వహించే 'ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ద్రౌపది ముర్ము శుక్రవారం నగరానికి రానున్నారు. రాజధానిలో ఒకేరోజు రాష్ట్రపతి, ప్రధాని, సీఎం కార్యక్రమాలు నగరంలో జరగనున్న నేపథ్యంలో మూడు కమిషనరేట్ల పోలీసులు విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రంజాన్ మాసంలో సున్నిత పరిస్థితుల దృష్ట్యా అసాంఘిక చర్యలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.