శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 2 మే 2019 (20:41 IST)

అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేసి రూ. 63 లక్షలు కాజేసి...

నమ్మినవారి ఇంట్లోనే దొంగతనం చేసి రూ.63 లక్షల రూపాయలు కాజేసి కటకటాలపాలయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి గంగోపాధ్యాయ వద్ద చిత్తూరు జిల్లాకు చెందిన వెంకట రమణ దంపతులు 2012 నుండి పని చేస్తున్నారు. అతని భార్య ఇంట్లో పని చేస్తుండగా... వెంకటరమణ కార్ డ్రైవరుగా విధులు నిర్వహిస్తుండేవాడు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారు వయస్సు మీద పడటంతో బ్యాంక్ లావాదేవీలు వెంకట రమణతో చేయించ సాగాడు. 
 
ఇదే అదనుగా తీసుకున్న వెంకట రమణ ఐఏఎస్ అధికారి బ్యాంక్ వివరాలు సేకరించి ఓ జిరాక్స్ షాప్‌లో బ్యాంక్ వివరాలు లాగిన్ చేసి అవసరం ఉన్నంత నగదును ట్రాన్స్‌ఫర్ చేసుకొనేవాడు. నగదును ట్రాన్స్‌ఫర్ చేసి ఇస్తున్నందుకు జిరాక్స్ షాప్ యజమానికి కొంత కమిషన్ కూడా ఇచ్చేవాడు. ఇలా అకౌంట్లో నుండి ఏడాది కాలంలో 63 లక్షలు రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసే సమయంలో ఐఏఎస్ అధికారి ఫోన్‌కు వచ్చే ఓటిపిను వెంకటరమణ భార్య సహాయంతో తెలుసుకొని డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకొనేవాడు. 
 
ఇలా దొంగిలించిన డబ్బుతో వెంకట రమణ రెండు కార్లను కొనుగోలు చేశాడు. అకౌంట్ నుండి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్లు గమనించిన ఐఏఎస్ అధికారి సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు, అధికారి ఇంట్లో పనిచేసే వెంకటరమణనే ఈ లావాదేవీలు జరిపినట్లు బ్యాంక్ అకౌంట్ ఆధారంగా గుర్తించారు. పని మనిషితో పాటు ఆమె భర్తను అదుపులో తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు సైబర్ క్రైమ్స్ అడిషనల్ డీసీపీ రఘువీర్ తెలిపారు. అతని వద్ద నుండి రెండు కార్లను సీజ్ చేసి.... అతడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.