ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (15:45 IST)

నా బిడ్డ పబ్‌కు వెళ్లలేదు.. బర్త్‌డే పార్టీకి వెళ్ళాడు - అంజన్ కుమార్ యాదవ్

హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా నక్షత్ర హోటల్‌లోని పబ్‌లో ఆదివారం వేకువజామున జూబ్లీహిల్స్ పోలీసులు దాడి చేసి దాదాపు 140 మందికిపై సెలెబ్రిటీలు, ప్రముఖుల పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. ఇది పెను సంచలనంగా మారింది. వీరిలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా డాటర్ నిహారిక కొణిదెల, తెలంగాణ మాజీ డీజీపీ కుమార్తె, కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు ఇలా అనేక మంది ప్రముఖులు, సినీ సెలెబ్రిటీల పిల్లలు ఉన్నారు. ఈ విషయం వెలుగులోకి రాగానే ఈ పబ్‌లో సోదాలు చేసిన జూబ్లీహిల్స్ సీఐ శివచంద్రుపై సస్పెన్షన్ వేటు పడగా, ఏసీపీకి చార్జ్‌మెమో ఇచ్చారు. 
 
అయితే, పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఈ కాంగ్రెస్ మాజీ ఎంపీ స్పందించారు. తన బిడ్డ పబ్‌కు వెళ్లలేదని, బర్త్‌డే పార్టీకి వెళ్ళాడని వివరించారు. బర్త్‌డే పార్టీకి వెళితే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
అంతేకాకుండా అనేక స్టార్ హోటళ్ళలో పబ్బులు ఉన్నాయని, పుట్టిన రోజు వేడుకల కోసం ఈ హోటళ్ళకు వెళితే పబ్బులపై దాడుల సందర్భంగా బర్త్ డే వేడుకలకు వెళ్లిన వారిని కూడా అదుపులోకి తీసుకెళుతున్నారని చెప్పారు. 
 
రాజకీయంగా తన ఎదుగుదలను ఓర్వలేని కొందరు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ కుటుంబానికి ఇప్పటివరకు ఎలాంటి చెడ్డపేరు లేదని అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలోని పబ్బులను మూసివేసి, మద్య నిషేధం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.