1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (19:52 IST)

తెలంగాణాలో ప్రైవేటు టీచర్లకు ఆపత్కాల సాయం.. బియ్యం కూడా : సీఎం కేసీఆర్

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా పాఠశాలలు గత యేడాది కాలంగా మూతపడివున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు స్కూల్స్ మూసివేయడంతో రోడ్డునపడ్డారు. అనేక మంది కూలీపనులు చేసుకుంటూ, కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్నారు. ఇలాంటి వారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ శుభవార్త చెప్పారు. 
 
రాష్ట్రంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం ప్రకటించారు. నెలకు రూ.2 వేల ఆపత్కాల ఆర్థిక సాయం, రేషన్‌ దుకాణాల ద్వారా 25 కిలోల బియ్యం అందివ్వాలని సీఎం నిర్ణయించారు. గుర్తింపు పొందిన ప్రైవేటు‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంక్‌ అకౌంట్‌, వివరాలతో జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
 
దీనిపై విద్యాశాఖ అధికారులను సమన్వయం చేసుకుని విధివిధానాలు ఖరారు చేయాల్సిందిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రైవేటు‌ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్పథంతో ఆదుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1.45 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.