1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 15 నవంబరు 2023 (09:18 IST)

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవు... ఎందుకంటే...

schools
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, పోలింగ్‌ జరిగే రోజుతో పాటు ముందుగా ఒక రోజు అంటే నవంబరు 29వ తేదీన కూడా పాఠశాలలకు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైగా, ఈ ఎన్నికల విధుల్లో ఏకంగా 1.06 లక్షల మంది ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. దీంతో ఈ నెల 29, 30వ తేదీల్లో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులు ఇచ్చింది. 
 
పోలింగ్‌ కేంద్రాలుగా ఉండే ప్రభుత్వ పాఠశాలలకు సిబ్బంది ముందురోజు మధ్యాహ్నం నుంచే చేరుకుంటారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 7 గంటలలోపే ఈవీఎంలను తీసుకునేందుకు ఉపాధ్యాయులు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ నెల 29, 30 తేదీల్లో బడులకు సెలవులని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ సూచన మేరకు అధికారికంగా ప్రకటించనున్నారు.
 
పోలింగ్‌ పూర్తయ్యి ఈవీఎంలను తీసుకొని ఆయా కేంద్రాలకు వెళ్లి సమర్పించి వచ్చే సరికి అర్థరాత్రి దాటుతుందని, అందువల్ల విధుల్లో పాల్గొన్న వారికి డిసెంబరు 1వ తేదీ కూడా సెలవు ఇవ్వాలని రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్‌, తెలంగాణ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎంఎస్‌టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.