ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:43 IST)

కంగనాతో కలిసి పనిచేయడం అసౌకర్యంగా ఫీలవుతున్నా.. పీసీ శ్రీరామ్

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాలీవుడ్ వివాదాస్పద ప్రముఖ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కనున్న ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేస్తూ.. 'కంగనా ప్రధాన పాత్రధారిణిగా ఓ ప్రాజెక్టు తెరకెక్కించాల్సివుంది. కానీ, ఆమెతో కలిసి పనిచేయడం అసౌకర్యంగా భావించాను. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలకు చెప్పగా, వారు అంగీకరించారు. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాను. ఆల్ ది బెస్ట్' అంటూ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
పీసీ శ్రీరామ్ ట్వీట్‌కు కంగనా రనౌత్ రీట్వీట్ చేస్తూ.. 'తన గురించి మీకు కలిగిన బాధ లేదా అసౌకర్యం ఏంటో తెలియదు. అయితే, మీరు తీసుకున్న నిర్ణయం సబబే. ధన్యవాదాలు.. ఆల్ ది బెస్ట్' అంటూ పేర్కొన్నారు. 
 
కాగా, కంగనా రనౌత్ ఇపుడు జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెల్సిందే. ముంబైను ఓ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చారు. దీంతో శివసేన పార్టీ నేతలు ఆమెపై కారాలుమిరియాలు నూరుతున్నారు. ఫలితంగా శివసేన - కంగనా రనౌత్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.