1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (13:30 IST)

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: భారతదేశంలో ప్రతి 28వ మహిళకు...

క్యాన్సర్ అత్యంత తీవ్రమైన వ్యాధులలో ఒకటి. వివిధ రకాల క్యాన్సర్ల కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. ఈ తీవ్రమైన వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి చికిత్స చేయడం వల్ల దాని తీవ్రత మరియు మరణ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

 
ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబోకాన్-2021 నివేదిక ప్రకారం, ఒక మహిళ తన జీవితంలో ఏదో ఒక రకమైన క్యాన్సర్ బారిన పడే ప్రమాదం 10% ఉంటుంది. అదే నివేదిక ప్రకారం, భారతదేశంలోని మహిళల్లో కొత్త క్యాన్సర్ కేసుల్లో 26.3% రొమ్ము క్యాన్సర్, 18.3% గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.

 
విశేషమేమిటంటే, ఈ క్యాన్సర్ కేసుల్లో 44% మందిని ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా మహిళలు పూర్తిగా రక్షించే అవకాశం వుంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రతి సంవత్సరం సుమారు 21 లక్షల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. భారతదేశంలో ప్రతి 28వ మహిళకు ఏదో ఒక రూపంలో రొమ్ము క్యాన్సర్ వస్తుంది. ఈ విధంగా, రొమ్ము క్యాన్సర్ మహిళల్లో అత్యంత సాధారణ క్యాన్సర్ వ్యాధిగా మారింది. దురదృష్టవశాత్తు, దీని గురించి అవగాహన లేకపోవడంతో పరిస్థితి దిగజారుతోంది.

 
30 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలందరూ తప్పనిసరిగా ఐదేళ్లకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి. తద్వారా ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించే అవకాశం వుంటుంది. మహిళల్లో వచ్చే క్యాన్సర్‌లు రొమ్ము లేదా గర్భాశయంలో ఎక్కువగా కనిపిస్తాయని వైద్యులు చెపుతున్నారు. ఈ వ్యాధి గర్భాశయంలో పెరగడం వెనుక చాలా కారణాలు ఉండవచ్చు.

 
చిన్న వయస్సులోనే వివాహం, చిన్న వయస్సులో బిడ్డకు జన్మనివ్వడం, అసురక్షిత లైంగిక సంబంధం, అధిక సంఖ్యలో గర్భం లేదా ప్రసవం, ధూమపానం మొదలైనవి. మరోవైపు రొమ్ము క్యాన్సర్‌కు కారణాలు పెద్ద వయస్సులో మొదటి బిడ్డను కలిగి ఉండటం, తమ బిడ్డకు తక్కువ లేదా అస్సలు పాలు పట్టని మహిళలు, అధిక బరువు, మద్యం- పొగాకు వాడకం, పెద్ద వయస్సులో రుతుక్రమం ఆగిపోవడం మొదలైనవి. రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉన్న కుటుంబాలలో అల్ట్రాసౌండ్ లేదా ఎమ్ఆర్ఐ చేయించుకోవడానికి బాలికలు ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించాలని వైద్యులు చెపుతున్నారు.

 
పొగాకుతో పెరుగుతున్న క్యాన్సర్
అన్ని రకాల క్యాన్సర్‌లలో పొగాకు పాత్ర కీలకంగా వుంటోంది. పొగాకు వాడేవారిలో 95 శాతం మందికి నోటి క్యాన్సర్ వస్తుంది. అదే విధంగా, దేశంలో క్యాన్సర్‌తో మరణిస్తున్న వారిలో 40 శాతం మంది పొగాకు వాడకం వల్ల మరణిస్తున్నారు. పొగాకు వినియోగం వల్ల ప్రతి సంవత్సరం 8 లక్షల మంది భారతీయులు మరణిస్తున్నారు, ఇది క్షయ, ఎయిడ్స్, మలేరియా కారణంగా మరణించే మొత్తం వ్యక్తుల కంటే చాలా ఎక్కువ.

 
పొగాకు పొగలో దాదాపు 4000 రసాయన మూలకాలు, 200 తెలిసిన టాక్సిన్స్, 60 క్యాన్సర్ కారక పదార్థాలు ఉంటాయి. ఇందులో కొంత నికోటిన్, పొగాకు తారు, కార్బన్ మోనాక్సైడ్, ఆర్సెనిక్, నాఫ్తలీన్, అమ్మోనియా మొదలైనవి ఉంటాయి. పొగాకు వల్ల గొంతు మాత్రమే కాదు, ఊపిరితిత్తులు, పెదవులు, నాలుక, నోరు, స్వరపేటిక, గర్భాశయం, మూత్రాశయం, ప్యాంక్రియాస్ వంటి వివిధ అవయవాలకు సంబంధించిన క్యాన్సర్లు వల్ల సంభవిస్తాయి. కనుక పొగాకు వాడకాన్ని పూర్తిగా మానివేయాలి.