బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (08:50 IST)

ఇక స్వేచ్ఛా జీవిని.. ప్రతి బంతినీ ఉత్తమంగా సంధిస్తా : శ్రీశాంత్

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో చిక్కుకున్న కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్... ఇపుడు జీవిత కాల నిషేధం నుంచి విముక్తిపొందారు. అతనిపై బీసీసీఐ విధించిన ఏడేళ్ళ నిషేధం ఆదివారంతో ముగిసిపోయింది. దీనిపై శ్రీశాంత్ స్పందిస్తూ, జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేక పోయినప్పటికీ కనీసం దేశవాళీ క్రికెట్‌లోనైనా ఆడతానని తెలిపాడు. 
 
'నాకిప్పుడు పూర్తిగా స్వేచ్ఛ లభించింది. నేను ఎక్కువగా ఇష్టపడే ఆటకు తిరిగి ప్రాతినిధ్యం వహిస్తాను. ప్రతి బంతినీ ఉత్తమంగా సంధిస్తాను. అది ప్రాక్టీస్ అయినా సరే బౌలింగ్ చేస్తాను' అంటూ ప్రకటించాడు. మరో ఐదు నుంచి ఏడేళ్లు ఆడతానని, తాను ఏ జట్టు తరపున ఆడినా అత్యుత్తమంగా ఆడతానని పేర్కొన్నాడు. 
 
అయితే, ప్రస్తుత కరోనా మహమ్మారి కారణంగా దేశీవాళీ సీజన్లు వాయిదా పడ్డాయి. కేరళ అతడికి అవకాశం ఇవ్వాలని భావించినప్పటికీ కొవిడ్ కారణంగా మ్యాచ్‌లు ఆగిపోయాయి. నిజానికి భారత్‌లో దేశవాళీ సీజన్ ఆగస్టులోనే ప్రారంభమవుతుంది. పరిస్థితులు అనుకూలించిన వెంటనే దేశవాళీ క్రికెట్‌కు అనుమతి ఇస్తామని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఇటీవల వ్యాఖ్యానించాడు. 
 
కాగా, 2013 ఐపీఎల్ ఎడిషన్‌లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధానికి గురయ్యాడు. అయితే, బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ గతేడాది ఈ నిషేధాన్ని ఏడేళ్లకు కుదించారు. ఆగస్టు 2013లో శ్రీశాంత్‌తోపాటు రాజస్థాన్ రాయల్స్ సహచరులు అజిత్ చండీలా, అంకీత్ చవాన్‌లను బీసీసీఐ నిషేధించిన విషయం తెల్సిందే.