1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (21:34 IST)

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు తల్లి మృతి : మూడు రోజుల బెయిల్

anantha babu
వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి అనారోగ్యం కారణంగా చనిపోయారు. దీంతో అంత్యక్రియల కోసం అనంతబాబుకు రాజమండ్రి కోర్టు మూడు రోజుల బెయిల్ మంజూరు చేసింది. 
 
తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ఏ1 నిందితుడిగా ఉంటూ రాజమండ్రి జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. ఆయన బెయిల్ కోసం పెట్టుకున్న దరఖాస్తులన్నీ కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో ఆయన తల్లి మృతి చెందడంతో అనంతబాబుకు సోమవారం మూడు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 
 
ఆదివారం మృతి చెందిన తల్లి అంత్యక్రియలు హాజరయ్యేందుకు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ అనంతబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు మూడు రోజుల పాటు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. 
 
ఒకవైపు, మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూనే మరోవైపు పలు షరతులు విధించింది. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి స్వయంగా లొంగిపోవాలని ఆదేశించింది. అంతేకాకుండా మూడు రోజుల పాటు స్వగ్రామం ఎల్లవరం సరిహద్దులు దాటి బయటకు రావొద్దని తెలిపింది. 
 
కేవలం తల్లి అంత్యక్రియల సమయంలోనే అనంతబాబు ఇంటి నుంచి బయటకు రావాలని, ఆయన వెంట నిత్యం పోలీసులు ఉండాలని ఆదేశించారు. అలాగే, ఈ కేసు గురించి ఎక్కడా ప్రస్తావించరాదన్న షరతు విధిస్తూనే, రూ.25 వేల బాండు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.