1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 మే 2023 (22:25 IST)

సజ్జల దర్శకత్వంలో జగన్ హీరోగా 'దొంగలకు దొంగ'

dongalaku donga poster
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో వైకాపాకు చెందిన కీలక నేతలను జనసేన, టీడీపీ నేతలు బాగానే టార్గెట్ చేశారు. వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గత నాలుగేళ్లుగా వైకాపా ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అధికార దుర్వినియోగాన్ని ఎండగడుతూ జనసేన పార్టీ సినిమా పోస్టర్లను రిలీజ్ చేస్తుంది. ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
నిన్నటికి నిన్న "పాపం పసివాడు.. నోట్లో వేలు పెట్టినా కొరకలేడు" అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంగ్యస్త్రాలు సంధించారు. అలనాటి పాపులర్ మూవీ "పాపం పసివాడు" సినిమా పోస్టర్ మాదిరిగానే సీఎం జగన్ ఇసుక దిబ్బల మధ్య సూట్ కేసులతో వెళుతున్నట్టుగా ఈ ఫోటోను జనసేనాని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ పోస్టర్ కింద 'లోకం పోకడ తెలియని అమాయకుడు' అనే క్యాప్షన్ కూడా జతచేశారు. ఇది రాజకీయ వర్గాల్లో పెను చర్చనీయాంశంగా మారింది. 
 
ఇపుడు తిరుపతికి చెందిన జనసేన పార్టీ నేతలు మరో పోస్టరును రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి హీరోగా "దొంగలకు దొంగ" అనే పేరుతో సినిమా పోస్టరును రిలీజ్ చేశారు. అలనాటి దొంగల దొంగ సినిమా పోస్టర్ మాదిరిగానే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సినిమాలో హీరో ముఖానికి బదులు సీఎం జగన్, ఇతర ఆర్టిస్టుల ముఖాలకు బదులు వైకాపా ప్రధాన నేతలు కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ ముఖాలను జోడించారు. ఈ పోస్టర్ ఇపుడు ఏపీ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.