1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (11:19 IST)

రెండు విడతల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ మెయిన్స్ ప్రవేశ పరీక్షలు

దేశంలోని ఎన్.ఐ.టీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌ మెయిన్స్ ప్రవేశ పరీక్షలను ఈ దఫా రెండు దశల్లో నిర్వహించనున్నారు. జాతీయ పరీక్షల మండలి (ఎన్.టి.ఏ) మంగళవారం దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆ ప్రకారంగా ఈ యేడాది జేఈఈ అడ్వాన్స్ పరీక్షలను రెండు దశల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, మొదటి దశ పరీక్షను ఏప్రిల్ 16 నుంచి 21వ తేదీ వరకు, రెండో సెషన్‌‍ను మే 24వ తేదీ నుంచి 29 తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఎన్.టి.ఐ సీనియర్ డైరెక్టర్ (ఎగ్జామ్స్) డాక్టర్ సాధనా పరాషర్ వెల్లడించారు. విద్యార్థులు మార్చి 1 నుంచి 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 
 
కాగా, గతంలో ఈ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించారు. గత 2019, 2020లలో ఆన్‌లైన్‌‍లోనే రెండు విడతలుగా నిర్వహించారు. కానీ, 2021లో మాత్రం కరోనా రెండో దశ కారణంగా విద్యార్థుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగు విడతల్లో నిర్వహించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో పాటు దేశ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు.