శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (19:02 IST)

ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ మహమ్మారి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టింది. అందుకు తాజా గణాంకాలే నిదర్శనం. గడచిన 24 గంటల్లో 6,923 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదేసమయంలో 45 మంది మరణించారు. 
 
ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 8 మంది మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో మరోసారి భారీగా కేసులు వచ్చాయి. తాజాగా 1,006 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. రాష్ట్రంలో మరో 7,796 మందికి కరోనా నయం అయింది.
 
మొత్తంగా గణాంకాలు చూస్తే, ఇప్పటివరకు ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,75,674కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 5,708కి పెరిగింది. మొత్తం 6,05,090 మంది కరోనా నుంచి విముక్తులు కాగా, ఇంకా 64,876 మంది చికిత్స పొందుతున్నారు.
 
60 లక్షలకు చేరువలో కేసులు 
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60 లక్షలకు చేరువలో వచ్చాయి. గత 24 గంటల్లో దేశంలో 88,600 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,92,533కి చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 1,124 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 94,503కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 49,41,628 మంది కోలుకున్నారు. 9,56,402 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
              
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 7,12,57,836 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,87,861 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
తెలంగాణాలో కొనసాగుతున్న ఉధృతి 
ఇంకోవైపు, తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 1,967 పాజిటివ్‌ కరోనా కేసులు నమోదుకాగా కోవిడ్‌ బారినపడిన వారిలో 2,058 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 9 మంది మృత్యువాతపడ్డారు. 
 
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,85,833 మంది కరోనా బారినపడగా 1,54,499 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి కాగా 30,234 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 24,607 మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా 1,100 మంది మృతి చెందారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
కోవిడ్‌ మరణాల రేటు 0.59 శాతంగా ఉండగా రికవరీ రేటు 82.939 శాతంగా ఉందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 50,108 మందికి కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 28,50,869 టెస్టులు పూర్తిచేసినట్లు వివరించింది.