ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 మార్చి 2020 (11:07 IST)

గూగుల్ ఉద్యోగి భార్యకూ కరోనా .. 9 మంది కరోనా బాధితులు జంప్

బెంగుళూరులో గూగుల్ కంపెనీలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. ఇపుడు ఆయన భార్యకు కూడా వైరస్ సోకినట్టు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలింది. బెంగళూరులోని గూగుల్ కేంద్రంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకిందని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆయన్ను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అదేసమయంలో క్యాంపస్‌లోని ఉద్యోగులందరినీ 'వర్క్ టు హోం'కు ఆదేశించారు.
 
ఈ ఉద్యోగి ఇటీవలే తన భార్యను తీసుకుని హనీమూన్ కోసం ఇటలీకి వెళ్లివచ్చారు. తిరిగి వచ్చాక భర్తకు కరోనా సోకిందని తెలియగానే అతని భార్య ఆగ్రాలో ఉన్న పుట్టింటికి పారిపోయింది. ఈమె బెంగళూరు నుంచి విమానంలో ఢిల్లీ చేరుకుని అక్కడి నుంచి ఆగ్రాకు చేరుకుంది. గూగుల్ ఉద్యోగిపై దృష్టి పెట్టిన వైద్యాధికారులు వారు ఇటలీ వెళ్లి వచ్చిన విషయాన్ని గుర్తించారు.
 
భర్తతోపాటు భార్యకు వైరస్ సోకే అవకాశం ఉందని బెంగళూరు వైద్యులు ఆగ్రా అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలోని వైద్యుల బృందం టెక్కీ భార్య పుట్టింటికి వచ్చారు. వారు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించడంతో కలెక్టర్, పోలీసులు జోక్యం చేసుకోవడంతో టెక్కీ భార్య అంగీకరించింది.
 
ఆమెకు వైరస్ సోకిందని నిర్ధారణ కావడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. ఆమెతోపాటు మొత్తం కుటుంబ సభ్యులు తొమ్మిది మందిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
పంజాబ్‌లో ఏడుగురు అదృశ్యం 
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే మన దేశంలో రెండు మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో, కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న 9 మంది అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. 
 
వీరిలో పంజాబ్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. మిగిలిన ఇద్దరు అమెరికాకు చెందిన దంపతులు. వీరిద్దరూ కేరళలోని ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. కరోనా బాధితులు అదృశ్యం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గాలింపు చర్యలు చేపట్టారు.