శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (21:43 IST)

అందుకే లాక్ డౌన్ పొడిగించాలంటూ పదేపదే చెప్తున్న సీఎం కేసీఆర్

తెలంగాణలో ఈ రోజు ఏప్రిల్ 11న మరో 31 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనితో తెలంగాణలో కరోనావైరస్ మొత్తం కేసుల సంఖ్య 504కి చేరింది. కాగా వీరిలో 43 మంది కోలుకోగా 9 మంది మరణించారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో 24 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల వివరాలు 405కు చేరాయి. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. 
 
"రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 9 నుంచి శనివారం సాయంత్రం 5 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరులో 17, కర్నూలులో 5, ప్రకాశం, కడప జిల్లాలలో ఒక్కొక్క కేసు నమోదైంది. కొత్తగా నమోదైన 24 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 405 కి పెరిగింది" అని వైద్య ఆరోగ్య శాఖ నిర్వహణలోని ఆరోగ్యాంధ్ర ట్విట్టర్ ఖాతా వెల్లడించింది.