మిస్సైళ్లు సంధించిన భారత బౌలర్లు... బెంబేలెత్తిపోయిన పాక్ బ్యాటర్లు... కొలంబోలో చిత్తుగా ఓడిన దాయాది
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలోభాగంగా, ఆదివారం రాత్రి కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ బౌలర్లు మిస్సైళ్లులాంటి బంతులు సంధించడంతో పాకిస్తాన్ ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. ఫలితంగా భారత నిర్దేశించిన 176 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకునే క్రమంలో 114 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఐసీసీ నిర్వహించే ప్రపంచ కప్ ఈవెంట్లలో పాకిస్తాన్పై భారత జట్టు మరోమారు తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది.
ఈ మ్యాచ్లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77) మెరుపు అర్ధశతకంతో కదం తొక్కాడు. తిలక్ వర్మ (25), సూర్యకుమార్ యాదవ్ (32), చివర్లో శివమ్ దూబే (27) రాణించడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఆ తర్వాత 176 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు అన్ని వికెట్లను సమర్పించుకుని 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 61 పరుగులతో టీమిండియా విజయభేరీ మోగించింది. పాక్ జట్టులో ఓపెనర్గా బరిలోకి దిగిన ఫర్హాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలోగు బంతికే డకౌట్ అయ్యాడు.
ఆ తర్వాత సైమ్ అయూబ్ 6, సల్మాన్ అఘా 4, బాబర్ అజమ్ 5, నవాజ్ 4లు సింగిల్ డిజిట్ స్కోరుకు ఔట్ కాగా, ఉస్మాన్ ఖాన్ 44, షదాబ్ ఖాన్ 14, షహీన్ షా ఆఫ్రిది 23 (నాటౌట్), ఫహీమ్ అష్రాఫ్ 10 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలు రెండేసి వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.