శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (15:31 IST)

వన్డే సిరీస్ వైట్‌వాష్ - భారత్‌పై న్యూజిలాండ్ అలవోక విజయం

బే ఓవల్‌ మైదానంలో భారత్‌తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు విజయభేరీ మోగించింది. భారత్‌ నిర్ధేశించిన 297 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఆటగాళ్లు మరో 17 బంతులు మిగిలివుండగానే సునాయాసంగా ఛేదించారు. ఓపెనర్లు మార్టిన్‌ గప్టిల్‌ (66, 6 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రీ నికోల్స్‌ (80, 9 ఫోర్లు), విలియమ్సన్ 22, టేలర్ 12, లాథమ్ 32, నీషమ్ 12, గ్రాండ్‌హోం 58 (ఒక సిక్సర్, ఒక ఫోర్) చొప్పున పరుగులు చేయడంతో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి 47.1 ఓవర్లలోనే 300 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. దీంతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ వైట్‌వాష్ చేసి.. ట్వంటీ20 సిరీస్‌లో ఎదురైన వైట్ వాష్ (5-0)కు ప్రతీకారం తీర్చుకుంది. 
 
అంతకుముందు భారత జట్టు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. అయితే, టీమిండియాకు రెండో ఓవర్‌లోనే గట్టిదెబ్బ తగిలింది. ఈ ఓవర్ చివరి బంతికి కివీస్ బౌలర్ జెమిసన్ షాకిచ్చాడు. ఒక్క పరుగు చేసి బ్యాటింగ్ చేస్తున్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియా 8 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. 
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బెన్నెట్ బౌలింగ్‌లో జెమిసన్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. ఫలితంగా ఎనిమిదో ఓవర్ ముగియకముందే భారత్ అత్యంత కీలకమైన రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 
 
ఆ తర్వాత ఓపెనర్ పృథ్వీ షా మాత్రం మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 40 పరుగులు చేసి రాణించాడు. డీ గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో పృథ్వీ షా రనౌట్ అయ్యాడు. అయితే, శ్రేయాస్ అయ్యర్(62) హాఫ్ సెంచరీతో, లోకేష్ రాహుల్(112) సెంచరీతో రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. 
 
ముఖ్యంగా, మనీష్ పాండే తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, 48 బంతుల్లో 42 పరుగులు చేశాడు. చివర్లో రవీంద్ర జడేజా, నవదీప్ సైనీ చెరో 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో మొత్తం 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో బెన్నెట్ 4 వికెట్లు తీయగా.. జెమిసన్, నీషమ్‌కు చెరో వికెట్ దక్కింది. ఫలితంగా కివీస్ ముంగిట ఉంచిన 297 పరుగుల విజయ లక్ష్యాన్ని కివీస్ ఆటగాళ్లు సునాయాసంగా ఛేదించి, భారత్‌పై ప్రతీకారం తీర్చుకున్నారు.