1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2022 (15:24 IST)

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : ఇంగ్లండ్‌కు షాకిచ్చిన క్రికెట్ పసికూన

ireland team
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో సంచలనాలు నమోదవుతున్నాయి. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో శ్రీలంకకు నమీబియా జట్టు షాకిచ్చింది. అలాగే, బుధవారం పటిష్టమైన ఇంగ్లండ్ జట్టుకు ఐర్లాండ్ జట్టు తేరుకోలేని షాకిచ్చింది. 
 
బుధవారం జరిగిన సూపర్-12 రౌండ్ గ్రూపు 1 మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 19.2 ఓవర్లలో 157 పరుగులు చేసింది. కెప్టెన్ ఆండీ బ్బిర్నీ 47 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. కీపర్ లోక్రాన్ టకర్ 34 రాణించడంతో ఆ మేరకు పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్, లియమ్ స్టోన్‌లు మూడేసి వికెట్లు తీశారు. 
 
ఆ తర్వాత 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జ ట్టు 14.3 ఓవర్లలో 105 పరుగులు చేసిన సమయంలో వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. కెప్టెన్ బట్లర్ డకౌట్ కాగా, హేల్స్ 7, స్టోక్స్ 6, మలన్ 35, అలీ 24 ( నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. చేతిలో ఐదు వికెట్లు ఉన్నప్పటికీ వర్షం ఇంగ్లండ్ విజయావకాశాలను దెబ్బతీసింది. 
 
దీంతో డక్ వర్త్ లూయిస్ విధానం మేరకు ఐర్లాండ్ జట్టును అంపైర్లు విజేతగా ప్రకటించారు. కాగా, ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌ను ఐర్లాండ్ జట్టు ఓడించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత 2011లో వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఐర్లాండ్ తొలిసారి విజయం సాధించింది. ఇపుడు పదేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత మరోమారు ఇంగ్లండ్ జట్టును ప్రపంచ కప్‌లో దెబ్బతీసింది.