శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By మోహన్ మొగిరాల
Last Modified: గురువారం, 4 ఏప్రియల్ 2019 (21:33 IST)

రూ.200 వాచ్ కోసం బేరమాడిన క్రికెటర్..

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు గుర్తుపట్టారా? ఇతడో స్టార్ క్రికెటర్. తన కెరీర్‌లో కోట్లు సంపాదించాడు. కానీ చివరకు చెన్నై మహానగరం వీధుల్లో తిరుగుతూ ఫుట్‌పాత్‌పై అమ్మే ఓ వాచ్ కోసం బేరమాడుతూ కనిపించాడు. చివరికి రూ.200 విలువ చేసే వాచ్‌ను రూ.180కి కొన్నాడు. ఇంతకీ ఈ క్రికెటర్ ఎవరు? అతను ఎందుకు ఫుట్‌పాత్‌పై వస్తువులు కొన్నాడో మీరు కూడా ఓ లుక్కేయండి..
 
ఇతని పేరు మాథ్యూ హేడెన్. ఆస్ట్రేలియా తరపున సక్సెస్‌ఫుల్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లో హేడెన్ కూడా ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్‌లో భాగంగా తొలి మూడేళ్లు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తరపున ఆడాడు. ఆ తర్వాత క్రికెట్‌కి గుడ్‌బై చెప్పి ప్రస్తుతం కామెంటేటర్‌గా స్థిరపడ్డాడు. ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ కోసం మరోసారి ఇండియా వచ్చాడు. ఈ సందర్భంగా తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు లుంగీ కట్టుకొని, ఓ నకిలీ గడ్డం, మీసం తగిలించుకొని.. చెన్నైలోని టీ.నగర్ స్ట్రీట్ మాల్‌లో షాపింగ్ చేసాడు. ఇంతకీ అతను ఎందుకు అలా సీక్రెట్ షాపింగ్ చేసాడో మీకు తెలుసా?
 
లెజెండరీ ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ హేడెన్‌కు ఓ సవాలు విసిరాడు. అందులో భాగంగా చెన్నైలో రూ.1000 లోపు ఉన్న వస్తువులు కొనాలన్నది ఆ ఛాలెంజ్. దీంతో హేడెన్ వెంటనే టీ.నగర్‌కు వెళ్లిపోయాడు. అక్కడ వెయ్యిలోపు విలువున్న లుంగీలు, షర్ట్‌లు, వాచ్‌లు కొన్నాడు. హేడెన్‌కు స్థానిక యువకుడు ఒకడు షాపింగ్ చేయడంలో సహాయం చేసాడు. ఓ వాచీ కోసం బేరమాడుతున్న తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో హేడెన్ పోస్ట్ చేసాడు. ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.