1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 మే 2021 (12:18 IST)

ఐపీఎల్ రెండో దశలో మహీ చితక్కొడుతాడు.. దీపక్ చాహర్

కాసుల వర్షం కురిపించే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో దశలో ఎంఎస్‌ ధోనీ విజృంభించి ఆడతాడని చెన్నై సూపర్‌కింగ్స్‌ పేసర్‌ దీపక్‌ చాహర్‌ అన్నాడు. 2018, 2019 సీజన్లలోనూ అతడు ఆలస్యంగా జోరు అందుకున్నాడని తెలిపాడు. పోటీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక నేరుగా వచ్చి ఆడటం ఎవరికైనా కష్టమేనని వివరించాడు. సీఎస్‌కే ప్రధాన బౌలర్‌గా మహీ తనపై విశ్వాసం ఉంచడం సంతోషకరమని తెలిపాడు.
 
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ తీరు మారింది. ఆఖర్లో సిక్సర్ల వర్షం కురిపించే అతడు ఒత్తిడికి లోనవుతున్నాడు. ఎక్కువ పరుగులు చేయడం లేదు. యూఏఈలో జరిగిన గత సీజన్లో విఫలమైన మహీ ఈ సీజన్‌ తొలిదశలో 37 పరుగులే చేశాడు. కరోనా వైరస్‌ కేసులతో 2021 సీజన్‌ సగం పూర్తయ్యాక ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
 
'ఏ బ్యాట్స్‌మనైనా 15-20 ఏళ్లుగా ఒకేలా బ్యాటింగ్‌ చేయలేరు. వీడ్కోలు పలికాక ఏ ఆటగాడైనా అత్యున్నత పోటీ ఉండే ఐపీఎల్‌కు వచ్చి బ్యాటింగ్ చేయడం కష్టం. మంచి ప్రదర్శనలు చేయడానికి సమయం పడుతుంది. అతనెప్పుడూ ఫినిషర్‌ పాత్ర పోషించేవాడు. 
 
క్రమం తప్పకుండా క్రికెట్‌ ఆడకపోతే అది మరింత కష్టమవుతుంది. 2018, 19 సీజన్లలోనూ ధోనీభాయ్‌ ఆలస్యంగా జోరందుకున్నాడు. టోర్నీ సాగేకొద్దీ మెరుగయ్యాడు. ఈ సీజన్‌ రెండో అర్ధభాగంలోనూ మహీ అత్యుత్తమంగా ఆడతాడు' అని చాహర్‌ ధీమా వ్యక్తం చేశాడు.