1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (08:40 IST)

ఫ్రెషర్లకు తేరుకోలేని షాకిచ్చిన విప్రో... ప్యాకేజీల్లో భారీగా కోత

Wipro
టెక్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన విప్రో తమ సంస్థలో కొత్తగా చేరిన వారికి తేరుకోలేని విధంగా షాకిచ్చింది. ఈ సంస్థలో పని చేసేందుకు ఎంపికైనపుడు ఇచ్చిన ప్యాకేజీ ఆఫర్‌లో భారీగా కోత విధించింది. శిక్షణ పూర్తి చేసిన తర్వాత సగానికి సగం ప్యాకేజీని తగ్గించేసింది. పైగా, ఈ సగం ప్యాకేజీకి అంగీకరిస్తేనే విధుల్లో చేరాలంటూ ఈమెయిల్స్ పంపించింది. 
 
గత 2022-23 వెలాసిటీ పట్టభద్రుల విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి తొలుత 6.5 లక్షల వేతన ప్యాకేజీని విప్రో ఆఫర్ చేసింది. శిక్షణ పూర్తి చేసుకున్న వారిని వచ్చే నెల నుంచి విధుల్లోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభించింది. అయితే, గతంలో ప్రకటించినట్టుగా రూ.6.5 లక్షల ప్యాకేజీకాకుండా రూ.3.5 లక్షల ప్యాకేజీ మాత్రమే ఇస్తామంటూ శిక్షణ పూర్తి చేసుకున్న సదరు ఉద్యోగులకు పంపించింది. పైగా, ఈ సగం ప్యాకేజీకి అంగీకరిస్తే తక్షణం ఉద్యోగాల్లో చేరవచ్చని తెలిపింది. 
 
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తమ వ్యాపార అవసరాలకు తగినట్టుగా నియామకాల్లో సర్దుబాటు చేస్తున్నట్టు ఆ మెయిల్‌లో విప్రో తెలిపింది. ఈ ఆఫర్‌కు అంగీకరించి వెంటనే విధుల్లో చేరాలని దీనిక ఒకే అంటే గత ఆఫర్ రద్దు అవుతుందని తెలిపింది. మరోవైపు, వెలాసిటీ పట్టభద్రుల విభాగంలో ఎంపికచేసిన వారిలో శిక్షణ సరిగా లేదని భావించిన 425 మంది శిక్షణా కాలంలోనే ఇంటికి పంపించింది.