1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 మే 2021 (14:32 IST)

కేరళ రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ : సీఎం పినరయి విజయన్

దక్షిణ భారతావనిలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న రాష్ట్రాల్లో కేరళ రాష్ట్రం ఒకటి. ఈ రాష్ట్రంలో ప్రతి రోజూ వేలాది సంఖ్యలో కొత్త కేసులో నమోదవుతున్నాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య ల‌క్ష‌లకు చేరిపోతోంది. అలాగే, వేల‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. 
 
ఈ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాలు నైట్ క‌ర్ఫ్యూలు, కంప్లీట్ క‌ర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌డౌన్‌లు, సంపూర్ణ లాక్డౌన్‌ల వంటి ఆంక్ష‌లు విధిస్తున్నాయి. తాజాగా కేర‌ళ ప్ర‌భుత్వం కూడా రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించింది.
 
రాష్ట్రంలో ఎనిమిది రోజుల‌పాటు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నామ‌ని, ఈ నెల 8న ఉద‌యం ఆరు గంట‌ల నుంచి 16న అర్థరాత్రి వ‌ర‌కు లాక్డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ తెలిపారు. క‌రోనా సెకండ్ వేవ్‌లో భాగంగా కేసులు పెరుగుతుండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.
 
ఇదిలావుంటే, అస్సాంలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. దిబ్రుఘ‌ర్ జిల్లాలోని జ‌లోని టీ ఎస్టేట్‌లో 90 మంది వ‌ర్క‌ర్ల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ నేప‌థ్యంలో ఆ టీ గార్డెన్‌ను కంటైన్‌మెంట్ జోన్‌గా అధికారులు ప్ర‌క‌టించారు. 
 
టీ గార్డెన్ లోపల ఉన్న వ్య‌క్తుల‌ను బ‌య‌ట‌కు రానివ్వ‌డం లేదు. స్థానికంగా ఉన్న ఆస్ప‌త్రితో పాటు స్టాఫ్ క్వార్ట‌ర్స్‌ను తాత్కాలిక ఐసోలేష‌న్ సెంట‌ర్లుగా మార్చారు. గార్డెన్ ప‌రిస‌రాల‌ను శానిటైజ్ చేసి, వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని డాక్ట‌ర్ న‌బ‌జ్యోతి గోగోయ్ తెలిపారు.
 
ఇక ఈ గార్డెన్ల‌కు స‌మీపంలో ఉన్న వారాంత‌పు సంత‌ల‌ను కూడా తాత్కాలికంగా ర‌ద్దు చేయాల‌ని అధికారులు ఆదేశించారు. త‌మ‌కు వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని టీ గార్డెన్ల‌లో ప‌ని చేసే కార్మికులు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తున్నారు.
 
కాగా, అసోంలో బుధ‌వారం ఒక్క‌రోజే 55 మంది క‌రోనాతో చ‌నిపోయారు. మృతుల సంఖ్య 1,485కు చేరింది. నిన్న 4,826 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,72,751కి చేరింది.