బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (17:20 IST)

కరోనా వైరస్ సోకి బీజేపీ రాజ్యసభ సభ్యుడు మృతి

కరోనా వైరస్ దెబ్బకు మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్నటికి నిన్న తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కన్నుమూశారు. ఈయన ప్రస్తుత లోక్‌సభలో తిరుపతి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ విషాదకర ఘటనను మరిచిపోకముందే... ఇపుడు బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ మృతి చెందారు. 
 
55 ఏళ్ల అశోక్ బెంగళూరులో కరోనాకు చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఇటీవల కోవిడ్ టెస్టులు నిర్వహించడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ నెల 2న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఈరోజు  ప్రాణాలు కోల్పోయారు.
 
అశోక్ గస్తీ తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. విద్యార్థి దశ నుంచి ఆయన ఆరెస్సెస్‌లో ఉన్నారు. ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో బీజేపీలో చేరారు. ఆ తర్వాత  అంచెలంచెలుగా ఎదుగుతూ రాజ్యసభ సభ్యుడి వరకు ఎదిగారు. అశోక్ గస్తీ మరణం పట్ల ఆ పార్టీ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి నేతను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.